ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ ఎంప్లాయిస్ వెబ్సైట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ కార్పోరేషన్ను ప్రారంభిస్తున్నామని, పొరుగుసేవల ఉద్యోగాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జీతం ఇచ్చేటప్పుడు ఉద్యోగులను మోసం చేయకుండా, మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. పొరుగుసేవల ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50 శాతం మంది ఉండాలని, అంతేకాకుండా జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయా శాఖాధిపతుల కమిటీ నుండి డిసెంబర్ 15 కల్లా ఉద్యోగాల జాబితా రావాలని, జనవరి 1 నుంచి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.