అత్యంత అధునాతమైన రష్యా క్షిపణి వ్యవస్థ ఎస్-400 టర్కీకి చేరుకుంది. దీనికి సంబంధించిన మొదటి కన్సైన్మెంట్ (రక్షణ ఉత్పత్తులు) అంకరాలోని ముర్టెడ్ వైమానిక స్థావరానికి చేరుకున్నట్టు టర్కీ రక్షణశాఖ వెల్లడించింది. నాటో సభ్యదేశమైన టర్కీ.. రష్యాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పటీ నుంచీ రద్దు చేసుకోవాలని అమెరికా టర్కీపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లు అడ్డుకునే 2017 చట్టం ప్రకారం ఆ దేశంపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ రష్యాతో టర్కీ ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం.
రష్యాతో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని ఈ నెల 31లోగా టర్కీ వెనక్కి తీసుకోలేదంటే తాము ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయాలను నిలిపేస్తామని టర్కీని అమెరికా హెచ్చరించింది. అంతేకాక ఈ యుద్ద విమానాలను నడపడంపై తమ దేశంలో శిక్షణ పొందుతున్న టర్కీ పైలట్లనూ బహిష్కరిస్తామని సృష్టం చేసింది. గత నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయిన తరువాత రష్యన్ క్షిపణుల కొనుగోళ్ల విషయంలో అమెరికా ఆంక్షలు విధించే అవకాశం లేదని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ చెప్పిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య ఉద్రికత్తలు పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.