తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2.5/5
బ్యానర్ : 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నటీ నటులు: మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ,
పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, పృథ్వి రాజ్ తదితరులు
సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్, మ్యూజిక్ - కె క్రిష్ణ కుమార్
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్, సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని, సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్
విఎఫ్ఎక్స్ - నాక్ స్టూడియోస్, సమర్పణ - శివ మేక
నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్
విడుదల తేదీ:08.02.2019
ఇది వరకు బయోపిక్ అంటే.. ఓ వ్యక్తి జీవిత ప్రస్థానం. అందులో మంచి, చెడూ రెండూ చూపించేవారు. ఇప్పుడు కేవలం పాజిటీవ్ కోణాలే బయోపిక్లుగా మారుతున్నాయి. బయోపిక్లకు నిజమైన అర్థం మారుతోంది. `యాత్ర` కూడా మరో రకమైన బయోపిక్. కేవలం ఓ భాగం కూడా తెరకెక్కించొచ్చు… అని `యాత్ర`తో చెప్పదలచుకున్నారో ఏమో దర్శక నిర్మాతలు. ఈనాటి ప్రేక్షకుడికి కావాల్సిన కమర్షియాలిటి, కావల్సిన హంగులు, కల్పనలు, డ్రామా జోడించొచ్చని చెప్పడానికి `యాత్ర` ఓ ఉదాహరణగా నిలుస్తుంది. వైఎస్ఆర్ జీవితాన్ని ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం, ఈ కథలో రాజకీయ కోణాలుండడం, త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు రాబోతుండడం, దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు మమ్ముట్టి నటించడం.. `యాత్ర`చిత్రం పై మంచి అంచనాలు వున్నాయి. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ యాత్ర ఎలా సాగింది? ఈ సినిమా వైకాపా అభిమానులనైనా సంతృప్తి పరచగలిగిందా? సమీక్షా లో తెలుసుకుందాం.
కథ:
అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 2003లో ముందస్తు ఎన్నికల్ని ప్రకటిస్తుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ .. చాలా బలహీనంగా ఉంటుంది. హైకమాండ్ సపోర్ట్ కూడా రాష్ట్ర కాంగ్రెస్కి లభించదు. మరోవైపు అధికార పక్షంవైపే సర్వేలన్నీ మొగ్గు చూపిస్తాయి. పోరాటం చేయాలా? లేదంటే రాజకీయాల నుంచి నిష్క్రమించాలా? అనే సందిగ్థంలో ప్రతిపక్ష పార్టీ అధినేత డా. వై యస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) పోరాటానికే సిద్ధమవుతాడు. ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రము అంతా పాదయాత్రకు శ్రీకారం చుడతాడు. ఆ పాద యాత్రలో వైఎస్ఆర్కి ఎదురైన అనుభవాలేంటి? 2004లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎలా అధికారంలోకి తీసుకొచ్చాడు? అనే అంశాల చుట్టూ యాత్ర సాగుతుంది. పావురాల గుట్ట ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించడంతో కథ ముగుస్తుంది.
నటీనటుల హావభావాలు :
ఇది మమ్మూటీ నటించిన ఏకపాత్రాభినయం. జాతీయ స్థాయిలో మంచి నటుడిగా పేరొందిన అలాంటి నటుడు ఉంటే…పక్కన మిగిలినవాళ్లెవరూ కనిపించరు. ఈ సినిమాలో అదే జరిగింది. వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయాడు. వైఎస్ హావాభావాల్ని కొన్ని చోట్ల పలికించిన విధానం ఆకట్టుకుంటుంది. సన్నివేశాల్లో డ్రామా ఉన్నా.. అది మమ్ముట్టి నటనలో కనిపించదు అంత సహజత్వమే ఉంటుంది వైఎస్ రూపమే కనిపిస్తుంది. ఈ విషయం లో మమ్మూటీ ని ఎంపికచేసుకోవడమే ఒక సక్సెస్. మిగిలినవి చిన్న పాత్రలే. వీహెచ్గా కనిపించిన తోటపల్లి మధు ఆహార్యం, సంభాషణల్ని బాగున్నాయి.
సాంకేతిక వర్గం పని తీరు :
వైఎస్ఆర్ జీవితంలో కేవలం ఓ భాగాన్ని మాత్రమే తీసుకున్నా, దానికి సినిమాటిక్ లక్షణాలు జోడించడంలో మహి విజయం సాధించడానే చెప్పాలి. అయితే అక్కడక్కడ ఆ డ్రామా ఎక్కువైనట్టు కనిపిస్తుంది. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ని చూపించడానికే దర్శకుడు ఎక్కువ మగ్గు చూపాడు. అవుట్ అండ్ అవుట్ పాజిటివ్ ఎపిసోడ్స్ తో రాసుకున్న సంభాషణలు సహజంగా ఉన్నాయి. పొలిటికల్ సెటైర్లు మరిన్ని వేసే అవకాశం ఉన్నా దర్శకుడు వాడుకోలేదు. సీతారామశాస్త్రి రాసిన పాట, అందులోని భావం.. రైతు కష్టాల్ని ఎత్తి చూపింది.
విశ్లేషణ:
వైఎస్ఆర్ బయోపిక్ అనగానే ఆయన పుట్టు పూర్వోతరాలు తో జీవితం మొత్తం అతని కథ తెరపై కనిపిస్తుందనుకుంటారంతా. కానీ.. `యాత్ర` అలాంటి కథ కాదు. పాద యాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ విషయాన్ని ముందే చెప్పేసి ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసింది చిత్రబృందం. ఏ బయోపిక్లో అయినా పాజిటీవ్ అంశాలే చూపిస్తారు. ఇక్కడా అంతే జరిగింది. వైఎస్ఆర్ ని హీరోగా చూపించడానికి ఎలాంటి సన్నివేశాలుండాలో.. అవన్నీ బాగా రాసుకున్నాడు దర్శకుడు మహి వి.రాఘవ. హై కమాండ్ని లక్ష్య పెట్టకపోవడం, వాళ్ల ఆదేశాల్ని ధిక్కరించి సొంత నిర్ణయాలు తీసుకోవడం లాంటి డైనమిక్ గా చూపించాడు. పాద యాత్రకు దారి తీసిన పరిస్థితులు ఇవన్నీ… వైఎస్ఆర్ ని ఒక హీరోగా చూపించడానికి చేసిన ప్రయత్నమే కనిపిస్తుంది, కాకపోతే ఆయా సన్నివేశాలన్నీ ఎమోషన్ని పెంచడంలో దోహదం చేశాయి. వైఎస్ఆర్ అనగానే ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ, పించన్లు గుర్తొస్తాయి. ఇలాంటి హమీలు ఇవ్వడం వెనుక గల కారణం ఏమిటి? అనే విషయాన్ని దర్శకుడు డ్రమెటిక్గా చూపించగలిగాడు. `రూపాయి డాక్టరు`గా వైఎస్ని మరోసారి గుర్తు చేశాడు. వైఎస్ఆర్ – కెవీపీల మధ్య ఉన్న అనుబంధం బాగా చూపించగలిగారు. వైఎస్ తన అనుచరులకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చేవారో చూపించడానికి కొన్ని సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు. చాలా మట్టుకు కల్పిత సన్నివేశాలే అనిపిస్తాయి. ఇవన్నీ నిజంగా వైఎస్ పాదయాత్రలో జరిగాయా? అనే అనుమానం కూడా కలుగుతుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకునే స్వేచ్ఛ దర్శకుడికి ఉండి ఉండొచ్చు. కానీ.. ఓ వ్యక్తి కథ చెబుతున్నప్పుడు అదీ బైయోపిక్ అన్నపుడు అయన జీవితంలో జరిగిన విషయాలే చూపిస్తే బాగుండేది.
తొలిభాగంలో వైఎస్ అభిమానులతో చప్పట్లు కొట్టించే సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి. కానీ ద్వితీయార్థంలో ఆ ఫ్లో లేదు. పతాక సన్నివేశాలు కూడా హడావుడిగా వచ్చి పడిపోయినట్టు అనిపిస్తాయి. హెలీకాఫ్టర్ ప్రమాదం, వైఎస్ఆర్ అంతిమ యాత్ర.. ఇవన్నీ అభిమానుల్ని కంట తడి పెట్టించే సన్నివేశాలే. బాబు పాత్రని ఫోన్ సంభాషణకే పరిమితం చేసారు. కనీసం జగన్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఆశ పడిన అభిమానులకు నిరాశ ఎదురవుతుంది. `జగన్ బాబు వస్తున్నాడు` అనే ఒకే ఒక్క డైలాగ్ మాత్రం వినబడుతుంది.
తీర్పు:
రాబోయే ఎన్నికలలో తమ పార్టీకి ఈ సినిమా ఉపయోగపడుతుందని వైకాపా అభిమానుల ఆశ. ప్రస్తుత పరిస్థితులను పరిశిలిస్తే...వైకాపా కు తెలుగు దేశం మెయిన్ విల్లన్ కానీ యాత్ర సినిమాలో మెయిన్ విలన్ చంద్రబాబు కాదు. తెలుగుదేశం పార్టీ అసలేకాదు, `అధిష్టానం` ఆ పార్టీ వ్యతిరేక స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపాకి ఎలాంటి ముప్పూ లేనప్పుడు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేనపుడు ప్రస్తుతం ఈ సినిమా ఎందుకు తీశారో ప్రేక్షకుడికి అంతుపట్టని ప్రశ్న. పోనీ వై యస్ ఆర్ జీవిత చరిత్ర మొత్తం తెలుసుకున్నాం చూసాం అంటే అదీలేదు.