అమెరికాలో వలస విషాదం.. ఒకే ట్రక్కులో

అమెరికాలో మరో వలస విషాద ఘటన చోటు చేసుకున్నది. టెక్సాస్లో శాన్ ఆంటోనియాలోని ఒక రోడ్డుపై నిలిపి వున్న ఓ కంటైనర్ ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అందులో ఉన్న నలుగురు చిన్నారులతో సహా మరో 16 మంది చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానలకు తరలించారు. వీరిలో నలుగురు చికిత్స పొందుతూ మరణిచారు. వీరంతా వలసదారులని, మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి వస్తున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. రోడ్డుపై నిలిపి వున్న కంటైనర్ ట్రక్కు నుంచి సాయం కోసం ఆర్తనాదాలు విన్న స్థానికంగా పని చేసే కార్మికుడు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు పరిశీలించగా ట్రక్కు డోరు కొద్దిగా తెరచి ఉన్నది. ఒకరి మృతదేహం ట్రక్కు కింద పడివుండటంతో పాటు ట్రక్కులో అనేక మంది అచేతనంగా ఉండటన్ని గుర్తించారు. 46 మంది చనిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ట్రక్కు మూసివున్న కారణంగా అందులోని అధిక ఉష్ణోగ్రత కారణంగా మరణాలు సంభవించినట్టు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.