ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం .... వారిని కూడా ఆహ్వానించండి

ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. దీనిపై ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం తమను ఆహ్వానించడం లేదని, పిలిచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సూర్యనారాయణ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్కు కలిసినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు కూడా ఇచ్చింది. అయితే దీనిపై సూర్యనారాయణ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.