కనువిందు చేసిన బాటా సంక్రాంతి వేడుకలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీన ఐసిసి, మిల్పిటాస్లో జరిగిన సంక్రాంతి వేడుకలు సంప్రదాయంగా వైభవంగా జరిగాయి. వంటలపోటీలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, పాటల పల్లకి, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, ప్రముఖ ఆన్-స్టేజ్ గేమ్ షో మరియు ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్లతో ఏర్పాటు చేసిన సంక్రాంతి కార్యక్రమాలు కనువిందు చేశాయి. మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభమై రాత్రి 10:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. వేడుకలు జరిగిన ఆడిటోరియం ప్రాంగణమంతా సంక్రాంతి వైభవాన్ని తలపించేలా అలంకరణలు చేశారు. ప్రధాన వేదికపై మల్టీకలర్ బ్యాక్డ్రాప్లు మరియు రంగురంగుల గాలిపటాలు ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు, ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు, ఇతరులు, బాటా వాలంటీర్లు సంప్రదాయ దుస్తులతో హాజరై కార్యక్రమానికి తెలుగు సొగసును కలిగించారు.
బాటా కరవొకె బృందం ఆధ్వర్యంలో జరిగిన ‘పాటల పల్లకి’తో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బృందంలోని గాయకులు తమ మధురమైన గొంతుతో సూపర్ హిట్ పాటలను పాడి అందరినీ ఆనందపరిచారు. తానా, బాటా చిన్నారులకు తెలుగు భాషను నేర్పించేందుకు ఏర్పాటు చేసిన ‘పాఠశాల’ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం, ఇతర కార్యక్రమాలు అలరించాయి. పిల్లలు తెలుగు భాషను నేర్చుకుని ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనడం, వారి తెలుగు భాషా ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. పెద్దలకు (సూపర్ చెఫ్), పిల్లలకు (లిటిల్ చెఫ్), రంగురంగుల రంగవల్లి పోటీలు, కళాపోటీలు, వ్యాసరచన పోటీలను కూడా ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించారు. పిల్లలు ఇంటి నుండి పదార్థాలను తీసుకువచ్చి, పెద్దల సహాయం లేకుండా అక్కడికక్కడే వారికి నచ్చిన ఆహారాన్ని తయారు చేసి తమ వంట నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సూపర్ చెఫ్ పురుషులు మరియు మహిళలు తమ వంట ప్రతిభను ప్రదర్శించారు. రంగవల్లి కార్యక్రమంలో పాల్గొన్న వారు వేసిన ముగ్గులు చూడముచ్చటగా కనిపించాయి. తంబోలా (హౌసీ) గేమ్లో కూడా పలువురు పాల్గొన్నారు.
సాయంత్రం 5:00 గంటలకు సంప్రదాయంలో భాగంగా పిల్లలకు ‘‘భోగిపళ్ళు’’ పోసే కార్యక్రమం జరిగింది. తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాన్నయ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలపై భోగిపళ్ళను పోసి ఆశీర్వదించారు. వసుదైవ కుటుంబం అంటే ఇదేనన్నట్లుగా పిల్లలు, పెద్దలు అంతా ఒకే వేదికపై కనువిందు చేశారు. రంగురంగుల సంప్రదాయ చీరలు ధరించిన మహిళలందరితో ‘‘గొబ్బెమ్మల’’ నృత్యం కూడా జరిగింది.
ఈ వేడుకల్లోనే అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎన్నికైన ప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అంబాసిడర్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మట్ మహన్ (మేయర్ శాన్ హోసే), మోంటానో (మేయర్ మిల్పిటాస్), అలెక్స్ లీ (అసెంబ్లీ సభ్యుడు)తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఎఐఎ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుకలకు హాజరైన వారందరికీ సంక్రాంతి, భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ప్రజాప్రతినిధులు, ఇతర అతిధులు తెలియజేశారు. ఈ వేడుకలను వైభవంగా ఏర్పాటు చేసిన బాటా నాయకులను, ఇతరులను అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, గీతాలాపనలు అందరిలోనూ దేశభక్తిని పెంపొందింపజేశాయి.
శ్రీ సాయి సరయు కూచిపూడి పాఠశాల చిన్నారులు డ్యాన్స్ బ్యాలెట్ ప్రదర్శించారు. టాలీవుడ్ నుండి తాజా సూపర్ హిట్ పాటలను బాటా యువతీ యువకులు పాడి ఉత్సాహాన్ని తెచ్చారు. దీంతోపాటు చిన్నారులు, యువతీ యువకులు చేసిన హై ఎనర్జీ మరియు ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్లు అదరగొట్టాయి. ఈ కార్యక్రమాలకోసం శాన హోసె, కుపెర్టినో, ఫ్రీమాంట్, శాన్ రామోన్తోపాటు ఇతర ప్రదేశాలలో చిన్నారులకు బాటా టీమ్ శిక్షణ ఇచ్చి, వారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన వచ్చేలా చేసింది. ఇందుకోసం బాటా బృందం చాలా కష్టపడింది. అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య గీతాలను ప్రదర్శించడంతో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. ‘‘మిషన్ మంగళ సూత్రం’’ కామెడీ నాటకం, వినోదభరితమైన డైలాగ్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆన్-స్టేజ్ గేమ్ షో కూడా పెద్ద సంఖ్యలో వచ్చినవారు పాల్గొనడంతో హిట్ అయింది.
ఈ కార్యక్రమానికి వ్యాపార సంస్థల నుంచి భారీ మద్దతు లభించింది. ప్రోగ్రామ్ యొక్క గ్రాండ్ స్పాన్సర్ ‘‘సంజయ్ టాక్స్ప్రో’’, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య ‘‘పవర్డ్ బై’’ స్పాన్సర్, గోల్డ్ స్పాన్సర్ ‘‘శ్రీని గోలీ రియల్ ఎస్టేట్స్’’ ఇతర స్పాన్సర్లలో ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్జి జ్యువెలర్స్, రైట్ కేర్, రియల్టర్ సాగర్ కోతా, ుAూూA.AI, స్లింగ్(దక్షిణ్) ఐటీయు ఉన్నాయి. బియానీ జంక్షన్ ఫుడ్ స్పాన్సర్గా వ్యవహరించింది.
హరినాథ్ చికోటి (అధ్యక్షుడు) మాట్లాడుతూ, బాటా వాలంటీర్ల సమష్టికృషితో ఈ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. కార్యక్రమాలను గ్రాండ్గా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీని పరిచయం చేశారు. కొండల్ కొమరగిరి (వైస్ ప్రెసిడెంట్), అరుణ్ రెడ్డి (కార్యదర్శి), వరుణ్ ముక్కా (కోశాధికారి), శివ కడ (సంయుక్త కార్యదర్శి).
స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీదుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి ఉన్నారు.
కల్చరల్ డైరెక్టర్లుగా శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి మరియు తారక దీప్తి.
నామినేటెడ్ కమిటీ’ సభ్యులుగా హరి సన్నిధి, సురేష్ శివపురం, శరత్ పోలవరపు.
యూత్ కమిటీ సభ్యులుగా ఉదయ్, సంకేత్, ఆదిత్య, గౌతమి, హరీష్, సందీప్.
బాటా సలహా సంఘం నాయకులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా సక్సెస్ చేసిన టీమ్ను అభినందించారు.