సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

దాదాపు 40 ఏళ్లనాటి భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన కేసులోని బాధితులకు పరిహారం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. 1984 భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ నుంచి అదనపు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గ్యాస్ లీక్ బాధితులకు దనపు పరిహారంగా రూ.7,844 కోట్లు ఇప్పించాలని అమెరికాకు చెందిన యూనియన్ కార్భైడ్ కార్పొరేషన్ కంపెనీలను ఆదేశించాలని కోరుతూ కేంద్రం 2010లో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది.
1989లో సెటిల్మెంట్ సమయంలో ప్రజల జీవితాలకు, పర్యావరణానికి జరిగిన వాస్తవ నష్టాలను సరిగా అంచనా వేయలేమని చెబుతూ, ఈ కేసును రీ ఓపెన్ చేయాలని కేంద్రం కోరింది. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, అభయ్ ఓకా, విక్రమ్నాథ్ జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. కేవలం మోసం కారణంగా మాత్రమే సెటిల్మెట్ను పక్కన పెట్టవచ్చని, అయితే ఈ అంశంపై కేంద్రం వాదించలేదని పేర్కొంది. అంతేగాక రెండు దశాబ్దాల తర్వాత ఈ సమస్యను లేవనెత్తడానికి ఎలాంటి హేతుబద్ధత అందించనందుకు కేంద్ర ప్రభుత్వంతో తాము సంతృప్తి చెందలేదు అని కోర్టు పేర్కొంది. కేంద్ర వేసిన క్యూరేటివ్ పిటిషన్పై జనవరి 12వ తేదీన సుప్రీం తన తీర్పును రిజర్వ్ చేయగా, నేడు తిరస్కరించింది.