అవసరం ఉన్నప్పుడు హడావుడి.. ఆ తర్వాత ఎక్కడి దొంగలు అక్కడే

అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆయన ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇద్దరు చిన్న ఉద్యోగులను అరెస్టు చేసి చేతులు దులుపుకొంటున్నారని విమర్శించారు. దీని వెనక ఉన్న పెద్ద తలకాయల బండారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పోటీ పరీక్షలకు ఆలస్యం చేసిన యువతను మళ్లీ మభ్యపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయి.
నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ కేసు ఎలా నీరుగారిపోయాయో అందరికీ తెలిసిందే. సిట్ అంటే తెలంగాణలో పర్మినెంట్గా పెండింగ్ అనే పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసు, నిఘా వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు. కీలక కేసుల్లో హడావుడి చేయటం తప్ప కేసులు దర్యాప్తు పూర్తిగా తేలలేదు. అవసరం ఉన్నప్పుడు హడావుడి చేస్తారు. ఆ తర్వాత ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి లీకేజీలు కొత్త కాదు. 2018లో టెట్ ప్రశ్నపత్రం లీకైంది. ఆ తర్వాత ఎంసెట్ పరీక్ష పేపర్ లీకైంది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాకనం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఫలితంగా 26 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యచేసుకున్నారు అని గుర్తు చేశారు.