ఏపీ హైకోర్టు మార్పుపై.. కేంద్రం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై తమకు పూర్తి స్థాయి ప్రతిపాదనలేవీ అందలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవీ వెంకట రమణలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖిల పూర్వక సమాధానమిచ్చారు. హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు పరిధిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలన్నారు. ఆ తర్వాత తరలింపుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిన్సిపల్ సీటును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని కోరుతూ 2020 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ ప్రతిపాదనలు పంపించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు అలాంటి పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని జవాబులో పేర్కొన్నారు. హైకోర్టును తరలించాలంటే రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. హైకోర్టు నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని తెలిపారు.