ప్రపంచ వేదికపై ఆంధ్రా జెండా ఎగురవేయాలి : వైఎస్ జగన్

మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో జగన్న విదేశీ విద్యాదీవెన పథకం నిధులు విడుదల చేశారు. 213 మంది విద్యార్థులకు తొలి విడతగా రూ.19.95 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మీషన్లు ఉన్నాయన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనన్నారు. ప్రపంచ వేదికపై మన విద్యార్థులు ఆంధ్రా జెండా ఎగురవేయాలన్నారు. పేదల చదువులకు పేదరికం అడ్డు కాకూడదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అగవర్ణాల పేదలకు సాయం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. గతంలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు సాయం అందిస్తున్నాము. ట్యూషన్ ఫీజు వందశాతం రీయింబర్స్మెంట్స్ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంఓలో అధికారులు అందుబాటులో ఉంటారు. ఇబ్బంది ఉంటే వెంటనే కాల్ చేయండి. ప్రతీ విషయంలో మీకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.