సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ యు.యు.లలిత్!

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ (ఉదయ్ ఉమేశ్ లలిత్) నియమితులుకానున్నారు. తదుపరి సీజేఐ పేరును సూచించాల్సిందిగా కోరుతూ కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో జస్టిస్ రమణ, కొత్త సీజేఐగా జస్టిస్ లలిత్ పేరును సూచించినట్లు తెలిసింది. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యు.యు. లలిత్ భాగస్వామి. ఆయన సీజేఐ అయితే బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తి అవుతారు.
జస్టిస్ యు.యు.లలిత్ ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేసిన మరుసటి రోజున (ఆగస్టు 27న) 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు వరుసలో ఉన్నారు. నవంబరు 9. 1957లో జన్మించిన ఆయన జూన్ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మర్చారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.