ఈ రెండూ కాదంటే రాష్ట్రం నుంచి.. పరిశ్రమలు పరిపోవాల్సిందే

ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారు జగన్ బినామీలైనా అయివుండాలి, లేకపోతే ఆయన వర్గానికి వాటాలైన ఇవ్వాల్సి ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు కాదంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవాల్సిందేనని మండిపడ్డారు. రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం రోజూ సీఎం జగన్ ఫొటోకి దండం పెడుతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వేదింపులు, వైసీపీ నేతలు వసూళ్లు తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో క్యాపిటల్ ఇఫ్లోకు బదులుగా రివర్స్ఫ్లో జరుగుతుండటం బాధాకరమని అన్నారు. ఎఫ్డీఐల ఆకర్షణలో 14వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేటు. ఉన్న పరిశ్రమలను బెదిరించి తమ వారికి కట్టబెట్టుకుంటున్నారు. కాకినాడ సెజ్, గంగవరం పోర్టు వంటివే ఇందుకు ఉదాహరణలు. ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకునే వాళ్లని బెదిరించటం లేదా వారి వ్యాపారాన్ని లాక్కోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. టెక్స్ టైల్స్, ఆహార ఇతర రంగాలకు ఇవ్వాల్సిన రూ.6 వేల కోట్లు రాయితీలు, ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.