భారత సంతతి అమెరికన్ పోలీసుకు ఆ దేశ శౌర్య పతకం

అమెరికాలోని న్యూయార్క్ పోలీసు శాఖకు చెందిన 27 ఏళ్ల భారత సంతతి అమెరికన్ సుమిత్ సులన్తో పాటు మరో తొమ్మిది మందికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌధంలో శౌర్య పతకాలు ప్రదానం చేశారు. పోలీసులకు ఇచ్చే అత్యున్నత అవార్డు ఇది. సులన్ 15 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలసవచ్చారు. న్యూయార్క్ నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో ఒక మహిళ తననూ, తన చిన్న కుమారుడిని హతమారుస్తానంటూ తన పెద్ద కుమారుడు ( అప్పటికే శిక్ష అనుభవించిన నేరస్థుడు) బెదిరిస్తున్నాడని 911 నంబరుకు అత్యవసర కాల్ చేవారు. వెంటనే సులన్తో సహా ముగ్గురు పోలీసులు అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నారు. నేరస్థుడు వారిపై కాల్పులు జరపగా జేసన్ రివేరా (22), విల్బర్ట్ మోరా (27) అనే పోలీసు అధికారులు గాయపడ్డారు. సుమిత్ సులన్ వెంటనే నేరస్థుడిపై రెండుసార్లు కాల్పులు జరిపి తల్లిని, చిన్న కుమారుడిని రక్షించారు. ఇదంతా 45 సెకన్లలోనే జరిగిపోయిందని, సులన్ దైర్యసాహసాలను అమెరికా అంతా శ్లాఘిస్తోందని అధ్యక్షుడు బైడెన్ పతకాల ప్రదానం సందర్భంగా పేర్కొన్నారు. ఇంతా చేసి సులన్ పోలీసు శాఖ చేరి కేవలం 2 నెలలే అయింది. నాటి ఘటనలో గాయపడిన పోలీసు అధికారుల్దిరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.