పార్టీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా : మంత్రి కేటీఆర్

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మండిపడ్డారు. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహన లేని నాయకుడు సంజయ్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రభుత్వ శాఖ కాదు. అది ఒక రాజ్యాంగబద్దమైన స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న కనీస అవగాహన కూడా ఆయనకు లేదన్నారు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నావనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు.
నిరుద్యోగుల పట్ల మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. ఆ పార్టీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 13 సార్లు ప్రశ్నపత్రం లీక్ అయింది. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్కు ఉందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత ప్రయోజనాలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు టీఎస్పీఎస్సీకి అందిస్తామన్నారు. రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రలో భాగంగా కాకుండా, ఉద్యోగాల సాధానపైనే యువత దృష్టి పెట్టాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.