ఈ మూడేళ్లలో వైసీపీ చేసిందేమిటి? ... యువగళంలో లోకేశ్

యువగళం పేరు ప్రకటించగానే వైసీపీ నాయకులకు వణుకు పుట్టిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కుప్పంలో యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ప్రకటించగానే 10 మంది మంత్రులు నాపై మాటల దాడికి దిగారు అని అన్నారు. దేశంలోనే తెలుగు జాతి గర్వ పడేవిధంగా ఎన్టీఆర్ కృషి చేశారు. ఆంధ్రుల సత్తా ఏంటో చంద్రబాబు చేసి చూపించారు. కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ మూడేళ్లలో వైసీపీ చేసిందేమిటి? జగన్ రెడ్డి అంటే జాదూరెడ్డి గుర్తొస్తున్నాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్నారు. ఏమయ్యాయి ఉద్యోగాలన్నీ? ప్రశ్నించారు. ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జాదూరెడ్డి ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. దానికి కారణం మీపైన ఉన్న కేసులే అని అన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా జాదూరెడ్డి? అని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. జే ట్యాక్స్ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. మహిళలపై దాడులు జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని ప్రగల్బాలు పలికారు. కానీ అది బుల్లెట్లు లేని గన్ అని ప్రజలకు అర్థమైంది అని లోకేశ్ విమర్శించారు.
త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకురాబోతున్నాం. ప్రభుత ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తామన్నారు. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మంత్రి పదవిలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఏ1 తేచ్చిన జీవో1తో అడ్డుకోవాలని చూస్తారా? పవన్ కల్యాణ్ పోరాటాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. పవన్ వారాహి వాహనానికి ఆంక్షలు పెడుతున్నారు. యువగళం ఆగదు, వారాహి ఆగదు. భయం నా బయోడేటాలోనే లేదు. అడ్డొస్తే తొక్కుకుని వెళ్లి పోతాం. మంచి కోసం పోరాడే దైర్యం ఉంది. సైకో పాలనలో అప్పులు ఆత్మహత్యలు, సైకిల్ పాలనలోనే సంక్షేమం అభివృద్ధి. 400 రోజుల పాదయాత్రలో ఇది తొలిరాజు. నిరుద్యోగ యువతకు పిలుపినిస్తున్నా కలసికట్టుగా ఉద్యమించి జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దాం అని అన్నారు.