ఆయన బాధ్యతను డీజీపీ తీసుకోకపోతే.. కేంద్ర హోంశాఖకు : పవన్ కల్యాణ్

నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి రక్షణ సిబ్బందిని తగ్గించారని, ఆయన ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని తెలిపారు. శాసనసభ్యులే ప్రాణహానితో భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రం హోంశాఖకు తెలియజేస్తామన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణభయంతో ఉన్నారు. వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. సీఎం జగన్ ఆయన కార్యాలయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోం మంత్రి ఎందుకు మాట్లాడట్లేదు? అని ప్రశ్నించారు. ప్రాణహాని ఉందని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి అని అన్నారు.