ఆయన్ను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేయరు? : రేవంత్

టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అధికార బీఆర్ఎస్కు చెందినవారి హస్తం ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా టీఎస్పీఎస్సీ వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ తతంగంలో చిన్న చిన్న వారిని కాకుండా తిమింగలాలను బజారులో శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పినా ప్రజలు రెండుసార్లు అవకాశం కల్పించారన్నారు. నిరుద్యోగుల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించలేదన్నారు. రాష్ట్రంలో ఏ పరీక్ష చూసినా పేపర్ లీకులే, బీఆర్ఎస్ పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయి. ఈ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసేస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీకి కారణం కేటీఆర్. ఆయన్ను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేయరు? పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈ నెల 22న గవర్నర్ను కలుస్తాం అని అన్నారు.