ఈ రిజల్ట్ ఎలాంటి ప్రభావం చూపదు : సజ్జల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యనించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సజ్జల మీడియాతో మాట్లాడుతూ పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిసి చూడాలని సూచించారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవన్నారు. టీడీపీ సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని స్పష్టం చేశారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని తెలిపారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. తాము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రలు ఓటర్లు లేరని తెలిపారు. యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందని, తెలంగాణలో చేసిన తరహాలోనే టీడీపీ ప్రయత్నాలు చేయొచ్చునని ఎద్దేవా చేశారు. అనంతపురంలో రీకౌంటింగ్ చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.