ఘనంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు 2022

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారు సంక్రాంతి సంబరాలు జనవరి 29 న శనివారం, డల్లాస్ లోని మార్ తోమా ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు శ్రీ ఉమా మహేష్ పార్నపల్లి మరియు సమన్వయ కార్యకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి గారి ఆధ్వర్యంలొ ఈ కార్యక్రమాలని నిర్వహించారు. సంస్థ 2021 సంస్థఅధ్యక్షురాలు శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి ప్రసంగిస్తూ ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలు మరియు సాంకేతిక శిక్షణలు జూం ద్వారా ఈ కరోనా సమయంలొ చేయటం జరిగినట్లు తెలిపారు. అంతే కాక 2022 పాలక మండలికి తన వంతు సహాయము ఎప్పుడూ ఉంటుంది అని తెలిపారు.
2022 సంవతర్సపు సంస్థఅధ్యక్షుడు శ్రీ ఉమా మహేష్ పార్నపల్లి ప్రసంగిస్తూ ‘‘ఈ ఏడాది మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఆటల పొటీలు, సాహిత్య సమ్మేళనాలు నిర్వహించ తలచాము’’ అని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ బృందాన్ని ఒక చక్కటి గేయంతో సభ కు పరిచయం చేసారు. ఉత్తరాధ్యక్షుడుగా శరత్ రెడ్డి ఎర్రం, ఉపాధ్యక్షులుగా సతీష్ బండారు, కార్యదర్శిగా సురేష్ పఠనేని, కోశాధికారిగా సుబ్బారెడ్డి కొండు, సంయుక్త కోశాధికారిగా భాను ప్రకాష్ వెనిగళ్ల ను పరిచయం చేసారు. పాలక మండలి అధిపతి వెంకట్ ములుకుట్ల గారు మరియు ఉపాధిపతి అనంత్ మల్లవరపు ప్రసంగిస్తూ, అందరికి 2022 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన శ్రీనివాసులు బసాబత్తిన, మధుమతి వైశ్యరాజు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను గుర్తు చేసుకుంటూ పిండి వంటలు, గొబ్బెమ్మలు, గాలి పటాలు, ఎద్దుల పోటీలు, హరిదాసులు, గంగిరెద్దులు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
సంక్రాంతి సంబరాలను చిన్నారులు సాహితీ వేముల, సింధూర వేముల వినాయకుడి మీద ప్రార్ధనా గీతంతో మొదలుపెట్టారు. కూచిపూడి కళాక్షేత్రకు చెందిన పిల్లలు సూర్య భగవానుడికి తమ కూచిపూడి నృత్యం ద్వారా ఆదిత్య పుష్పాంజలి సమర్పించారు. లాస్య సుధా అకాడమీ, గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, సాయి నృత్య అకాడమీ స్కూల్ ఆఫ్ కూచిపూడికి చెందిన చిన్నారులు కూచిపూడి నృత్యం ద్వారా అన్నమయ్య కీర్తనలకు, వందేమాతరంకు నర్తించారు. లాస్య సుధా అకాడమీకి చెందిన చిన్నారులు భరతనాట్యంతో ‘‘సరసిజాక్షులు - కృష్ణ శబ్దం’’ను ప్రదర్శించారు. కార్తి గ్రూప్, యూ డాన్స్ టీం, దేశి ఇల్యూషన్ గ్రూప్ కి చెందిన పిల్లలు తెలుగు సినీచిత్ర గీతాలకు నర్తించి అందరినీ అలరించారు. డాలస్ కి చెందిన కళాకారులు ప్రభాకర్ కోట, చక్రపాణి కుందేటి, శారద చిట్టిమల్ల, స్నిగ ఏలేశ్వరపు తమ పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు. కొత్తగా భాద్యతలు స్వీకరించిన సాంస్కృతిక కార్యదర్సి శ్రీమతి మాధవి లోకిరెడ్డి యెంతో నేర్పుగా సమయస్పూర్తితో కార్యక్రమాలని ముందుకు నడిపించారు.
కార్యక్రమ సమన్వయ కర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి, పొషక దాతల గురించి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసారు. మరియు ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 9, టీవీ 5, ఆశియా నెట్ సాక్షి, ఈనాడులకు కృతజ్ఞతలు తెలియజేసారు.