వాషింగ్టన్ డీసీ లో ఎన్టీఆర్ కు ఘన నివాళి

వాషింగ్టన్ డీసీలో ఈ నెల 18న నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిడిపి ఎన్నారై నాయకుడు సతీశ్ వేమన మాట్లాడుతూ నిలువెత్తు తెలుగు తేజం, నిండైన వ్యక్తిత్వంతో తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన దైవం ఎన్టీఆర్ అని కొనియాడారు. చరిత్ర అన్న పదానికి చిహ్నంగా నిలిచిన నాయకుడు.. నట జీవితాన్ని ప్రజా జీవితం కోసం అర్పించిన మహానాయకుడన్నారు. చైతన్య రథం ఎక్కి చరిత్ర సృష్టించి, రాజకీయ శూన్యతను రూపుమాపి, తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపిన జన నేత అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి గట్టి పునాదులతో బడుగు, బలహీనవర్గాల, దళిత సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజలతో మమేకమయ్యారని గుర్తు చేసుకున్నారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుంటూరు జిల్లా మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు.
రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని ఎన్ఆర్ఐ నరేన్ కొడాలి అన్నారు. తను ఏ పాత్రలో నటించినా దానికి పూర్తిగా న్యాయం చేయాలని తపించిన అతి కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్ ఒకరన్నారు. నాటి, నేటి పాలకులకు ఎన్టీఆర్ చూపిన ప్రజాహిత పాలనే ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ ఉప్పలపాటి, రఘు మేకా, రవి అడుసుమల్లి, రవి గౌరినేని, కార్తీక్ కోమటి, సిద్ధార్థ బోయపాటి, సాయి సుమంత్ శ్రీరామ్, డా.నాగ దేవినేని, డా. లిఖిత్ యల్లా, రమేష్ అవిరినేని తదితరులు పాల్గొన్నారు.