మేము అధికారంలోకి వచ్చిన.. మొదటి 30 రోజుల్లోనే

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు. రైతులకు రుణమాఫీని విడతల వారీగా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వృథా ఖర్చును పూర్తిగా నిరోధిస్తామన్నారు. రైతుబంధును పేదలకు ఇవ్వాల్సి ఉండగా ధనికులకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వెసులుబాటు దృష్టిలో ఉంచుకునే వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించామని తెలిపారు. ఏడేళ్లలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.
రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసే తెలంగాణ ఇచ్చామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. రానున్న రోజుల్లో వైద్యం, విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వస్తే పంటల విషయంలో గందరగోళ పరిస్థితులు ఉండవని, పంట మార్పిడి అవసరమైతే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామని అన్నారు.