ఇళ్లవద్దకే మెకానిక్స్... మాటిచ్చి నిలబెట్టుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు..
భారీవర్షాలు, బుడమేరు విధ్వంసంతో తీవ్ర విషాదంలో ఉన్న బెజవాడ వాసులను ఆదుకునే విషయంలో సీఎంచంద్రబాబు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వరద పరిస్థితుల్లో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించి, బాధితులకు సాయమందించేందుకు శాయసక్తులా ప్రయత్నించిన చంద్రబాబు... వరద తర్వాత విపత్కర పరిస్థితులపైనా ఫోకస్ పెట్టారు. వర్షాలతో తడిసి పాడైన వాహనాలను గ్యారేజ్ లకు తరలించే పరిస్థితి లేదు. దీంతో ఇళ్లకే మెకానిక్స్ ను పంపి బాగు చేయిస్తామన్న చంద్రబాబు.. చెప్పినట్లుగానే బైక్ రిపేరింగ్ హామీని నిలబెట్టుకుంటున్నారు.
వరదల్లో మునిగి పాడైన బైక్స్ ను రిపేరింగ్ చేయిస్తామని మాటిచ్చిన చంద్రబాబు.. అన్నట్లుగానే బైక్ మెకానిక్స్ ను ప్రజల ఇళ్లవద్దకే పంపిస్తున్నారు. ఇళ్లవద్దకే వెళ్తున్న మెకానిక్స్.. ఆయా ఇళ్లలోనే బైక్స్ రిపేర్ చేస్తున్నారు. అంతేకాదు... ఈప్రక్రియ జరుగుతున్న ప్రదేశాల్లో పోలీసులను కాపలాగా ఉంచుతున్నారు. దీంతో ప్రజల్లో కూడా సానుకూల స్పందన కనిపిస్తోంది.పాడైన బైక్స్ బాగు చేయించాలంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 2 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని.. చంద్రబాబు నిర్ణయంతో ఉచితంగానే పూర్తవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వేర్వేరు ప్రాంతాల నుంచి మెకానిక్లను విజయవాడకు తీసుకువచ్చింది చంద్రబాబు సర్కార్. వీరంతా కూడా.. ఆర్టీసీ… పోలీసు, అగ్నిమాపక, ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే స్కిల్డ్ టెక్నీషియన్స్. వీరితో పాటు.. పలు ప్రముఖ కంపెనీలు టీవీఎస్, హీరో హోండా, సుజుకి తదితర కంపెనీలతోనూ మాట్లాడి .. ఆయా కంపెనీల్లోని మెకానిక్లను తీసుకువచ్చారు. సోమవారం మధ్యాహ్నం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లోయుద్ద ప్రాతిపదికన బైకులు రిపేర్ చేసే పనిని చేపట్టారు. రేయింబవళ్లు ఈ పనులు సాగుతాయని.. పోలీసులు కాపలాగా ఉంటారని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. వరదలకు బైక్స్ తో పాటు ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర గృహోపకరణాలు కూడా నీట మునిగిపాడైపోయాయి. అయితే...టీవీలు, ఫ్రిడ్జ్లు బాగు చేయడమా..? లేక.. ఇన్సూరెన్స్ ఇప్పించడమా? అనే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది.