YS Jagan : జగన్ ముందు రూల్స్ గీల్స్ జాన్తా నై..!?
అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పార్టీలు అడ్డగోలుగా వ్యవహరిస్తుంటాయి. నిబంధనలను అతిక్రమించి మన అనుకున్నోళ్లకు మేలు చేస్తుంటాయి. అప్పుడు అధికారంలో ఉంటారు కాబట్టి ఇలాంటివి పెద్ద సమస్యలుగా కనిపించవు. అధికారం కోల్పోగానే ఇలాంటివన్నీ బయటికొస్తాయి. మెడకు చుట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (YS Jagan) పరిస్థితి ఇంతే. తాను అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా విశాఖ శారదాపీఠానికి ( Visakha Sarada peetham) కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసే పనిలో ఉంది చంద్రబాబు (Chandrababu) సర్కార్.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి (Swaroopanandendra Swamy).. వైసీపీ (YCP) అధినేత జగన్ కు ఎంతటి సన్నిహితుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా ఆయన జగన్ కు రాజగురువు. స్వామీజీ అయినా జగన్ ను ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ల మధ్య సంబంధం అంత గట్టిది. అందుకే అధికారంలోకి రాగానే స్వరూపానందేంద్రకు ఏదైనా మంచి చేయాలనుకున్నారు. అందుకే 2021 నవంబరులో భీమిలిని (Bheemili) ఆనుకుని 15 ఎకరాల భూమిని (land) ఎకరం లక్ష చొప్పున రూ.15 లక్షలకు కట్టబెట్టేసింది. సంస్కృత (Sanskrit) పాఠశాలను ఏర్పాటు చేసేందుకు, వేద (Vedas) విద్యను వ్యాప్తి చేసేందుకు ఈ భూమిని ఇస్తున్నట్టు జీవోలో పేర్కొంది.
అయితే అక్కడ సంస్కృత పాఠశాల కట్టలేదు. వేద విద్యను వ్యాప్తి చేయలేదు. పైగా 2023 నవంబర్ 20న శారదా పీఠం ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. పీఠానికి ఆదాయాన్ని సముపార్జించి పెట్టేలా ఈ భూములను వాడుకోవాలనుకుంటున్నామని.. ఆ మేరకు వీలు కల్పించాలని కోరింది. గతంలో ఇచ్చిన జీవో మేరకు తమకు సంస్కృత పాఠశాల నిర్మించే ఉద్దేశం కానీ, వేదవిద్యను వ్యాప్తి చేసే ఉద్దేశం కానీ లేదని ఆ లేఖలో స్పష్టం చేసింది. సహజంగా ఇలా వాణిజ్య కార్యకలాపాలకు ప్రభుత్వ భూములను ఇంత తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ఏ ప్రభుత్వమూ సాహసించదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటివేమీ పట్టించుకోలేదు. శారదా పీఠం కోరినట్లు ఆ భూములను వాణిజ్య కార్యకలాపాలకు వాడుకునేందుకు అనుతిచ్చేశారు. ఈ మేరకు 2024 ఫిబ్రవరిలో కొత్త జీవో కూడా ఇచ్చేసింది.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేటాయించిన కోట్లాది రూపాయల విలువైన భూములను రద్దు చేయాలనే డిమాండ్ మొదలైంది. వాస్తవానికి ఆ 15 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.225 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అలాంటి భూములను కేవలం రూ.15 లక్షలకు ఎలా ఇస్తారని.. అది కూడా పీఠం ఆదాయం పెంచుకునేందుకు ఎలా అనుమతిస్తారనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో ఈ భూములను వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో (Cabinet meeting) ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. అయితే జగన్మోహన్ రెడ్డి తెగింపును మాత్రం అందరూ తెగమెచ్చుకుంటున్నారు. మనోడైతే జగన్ ఎందాకైనా వెళ్తాడనేందుకు ఇదే నిదర్శనమంటున్నారు. అయితే ఇలా అడ్డగోలుగా చేసేస్తే చివరకు ఇలాగే జరుగుతుందనే వాళ్లూ ఉన్నారు.