న్యూయార్క్ ప్రతినిధులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందని, ఈ దశలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పది రోజుల అమెరికా పర్యనటలో భాగంగా న్యూయార్క్లోని వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్, ములగో ఫౌండేషన్స్ సీఈవో కెవిన్ స్టర్, బియాండ్ నెట్ జీరో చైర్మన్ లార్డ్ జాన్ బ్రౌన్ తదితరులతో భేటీ అయ్యారు.
వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, రైతుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ప్రధానంగా చర్చించారు. అనంతరం నిరుపేద మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుకు సహకారం అందించే విషయమై బ్రిటీష్ బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్, యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ క్రిస్టోఫర్ ఆంధోనీతోనూ మంత్రి కొండపల్లి చర్చలు జరిపారు. దీనికి క్రిస్టోఫర్ ఆంధోనీ అంగీకారం తెలిపినట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది.