వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా..? ఊడుతుందా..?
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా లక్షమంది ఇప్పటికే రిజైన్ చేయగా.. మిగిలిన వారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఎన్నికల సమయంలో వారిని తొలగించమని, నెలజీతం పదివేలు చేస్తామని కూటమి సర్కార్ హామీ ఇచ్చింది. అయితే లేటెస్టుగా పెన్షన్ల పంపిణీకి వారిని దూరంగా ఉంచడంతో.. వారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.
వైసీపీ హయాంలో దాదాపు రెండున్నర లక్షలమందిని వాలంటీర్లుగా నియమించారు.వారిలో 90 శాతం మంది వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులే ఉన్నారని .. సాక్షాత్తూ వైసీపీ నేతలు పబ్లిగా చెప్పారు. దీంతో వీరందరి సాయంతో ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ సర్కార్ ప్రయత్నించిందన్న వార్తలు వచ్చాయి. అయితే కూటమి పార్టీలు ముందస్తుగా అప్రమత్తం కావడం, ఈసీని ఆశ్రయించడంతో.. ఆదిలోనే అధికార పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. దీనికి తోడు వైసీపీ నేతలు చెప్పడంతో.. లక్షమంది రాజీనామాలు చేశారు.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత .. వాలంటీర్లను కాస్త దూరం పెట్టడం ప్రారంభించారు. ఎందుకంటే మొన్న ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీని.. సచివాలయం ఉద్యోగులతో పూర్తి చేయించారు. దీంతో వాలంటీర్ల పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజీనామాలు చేసినవారిని పక్కన పెడితే.. మిగిలిన వారికి ఈనెల జీతం రాలేదు. ఇప్పుడున్న వలంటీర్లను పక్కన పెట్టి వారి స్థానంలో టీడీపీ, జనసేన వాళ్లను నియమించుకుంటారా.. లేక మొత్తంగా ఈ వ్యవస్థనే రద్దు చేస్తారా అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది.
ఐతే పింఛన్ల పంపిణీ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వలంటీర్ల వ్యవస్థ కొనసాగడం కష్టమే అనిపిస్తోంది.పింఛన్ల పంపిణీ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించి విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన నేపథ్యంలో వలంటీర్లు లేకున్నా పింఛన్లు ఆగలేదు కదా అని పవన్ మాట్లాడారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తామని అన్నారు కానీ.. పింఛన్ల పంపిణీ ఇతర అవసరాలకైతే వాళ్లు అవసరం లేదన్నట్లే ఉంది పవన్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే. దీంతో ఇక ఈ వ్యవస్థకు మంగళం పాడినట్లే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.