ASBL NSL Infratech
facebook whatsapp X

హైదరాబాద్‌ లోని ప్రాంతాలు... వాటికి  ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి?

హైదరాబాద్‌ లోని ప్రాంతాలు... వాటికి  ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి?

 

 ♨️ బేగం పేట.
6వ నిజాం మహబూబ్ అలీ కుమార్తె బ‌షీర్ ఉన్నిసా బేగంను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు..కూతురికి క‌ట్నం కింద‌ ఒక స్థలాన్ని కట్నంగా ఇచ్చాడు. 
ఆ స్థలానికి బషీర్ ఉన్నిసా బేగం పేరు మీదుగా బేగంపేట అని పేరు వచ్చింది. 

 ♨️చార్మినార్
కులికుతుబ్ షా కట్టిన ఈ కట్టడానికి  ప్రధాన ఆకర్షణ నాలుగు స్థంబాలు…. 
ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు… వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వ‌చ్చింది!

 ♨️సికింద్రాబాద్
మూడో నిజాం సికిందర్ ఝా పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది. అంతకుముందు సికింద్రాబాద్ ని లష్కర్ అని పిలిచేవారు.

♨️ఖైరతాబాద్
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.

♨️శంషాబాద్
షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వ‌చ్చింది. ష‌మ్స్ అంటే సూర్యుడు. దీని అర్థం ప్రభువులలో సూర్యుడిలాంటివాడని…. 
ఈ బిరుదు నవాబ్ మొయిన్- ఉద్- దౌలా బహదూర్ కు ఉంది.

♨️నాంపల్లి
నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.

♨️హిమయత్ నగర్
1933 లో  ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ ఆస‌ఫ్ జా పేరు మీద ఆ స్థలానికి హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది.

♨️అబిడ్స్
ఆరో నిజాం కాలంలో అల్‌బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా యూదు వ్యాపారి ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత  కొంతకాలానికి ఆల్బర్డ్ అబిద్​  ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిన‌ప్పటికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది! కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.

♨️సోమాజిగూడ
నిజాం కాలంలోని రెవెన్యూ  డిపార్ట్మెంట్  అధికారైన సోనాజీకి  కొన్ని  భూములుండేవి. సోనాజీ కాస్త సోమాజి అయింది.  
గూడ అంటే చిన్న గూడెం లేదా ప్రాంతం అని అర్ధం. రెండు క‌లిపి సోమాజిగూడ అయ్యింది.

♨️మాసబ్ ట్యాంక్
6వ కుతుబ్ షాహ్ భార్య హ‌యత్ భ‌క్షి బేగంను మాసాహెబా అని  పిలిచేవారు. మాసాహెబా పల్లె భూములకు  సాగునీరు  ఇవ్వడానికి ఒక ట్యాంక్  (చెరువు) నిర్మించింది.  
ఆ ట్యాంక్  పేరు  మాసాహెబా తలాబ్  అని  పిలిచేవారు. చివరకు ఆ పేరు మాసబ్ ట్యాంక్ అయింది.

 ♨️హైదరాబాద్
కులీకుతుబ్ షా భార్య  భాగమతి  వివాహం తర్వాత తన  పేరుని  హైదర్ మహల్ గా  మార్చుకున్నారు. హైదర్ మహల్  అంటే  హైద్రా నగరం  అని  అర్ధం తర్వాత  ఆ పేరు  మీద  హైదరాబాద్ గా  మారింది .

♨️మలక్ పేట్
గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్ షా సేవకుడు మాలిక్ యాకుబ్ పేరు మీదగా ఈ ప్రదేశానికి మలక్ పేట్ అనే పేరు వచ్చింది.

 ♨️బషీర్ బాగ్
బసిరుద్దౌలాకు   హైద్రాబాద్ లో   ఒక ప్యాలెస్ ఉండేది. ఆ ప్యాలెస్ దగ్గర పెద్ద గార్డెన్ ఉండేది. బసిరుద్దౌలా పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్ అనే పేరు వచ్చింది.  
బాగ్ అంటే తోట  (గార్డెన్)  అని అర్ధం.

♨️ఫలక్ నుమా:
ఫలక్  అంటే  ఆకాశం, నామ అంటే అద్దం. ఈ ప్రదేశం అంతా కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది. కాబట్టి ఆకాశానికి అద్దం అనే అర్థం వచ్చేలా ఫలక్ నామ అని పేరు పెట్టారు. ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!

♨️సరూర్ నగర్
రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరు మీదనే స్థిరపడింది.

♨️లంగర్ హౌజ్:
గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ గా మారింది. 
గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.

♨️చెంచల్‌ గూడ:
 చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.

♨️కార్వాన్:
ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు.
 వజ్రాలు, ముత్యాల వ్యాపారుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.

♨️కవాడిగూడ:
ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.

♨️దోమలగూడ:
 దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారి పేరు మీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.

♨️బేగం బజారు:
 హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.

♨️అఫ్జల్ గంజ్:
 ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది

♨️హైదర్ గూడ:
మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.

♨️తార్నాక:
తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె.. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. 
దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.
♨️శాలిబండ:
 శాలిబండ అసలు పేరు షా-అలీ -బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ  మీద నివసించేవాడు. 
ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు.. కాలక్రమంలో అది శాలిబండగా మారింది

♨️హబ్సిగూడ: 
నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు.
 అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను హబ్సిగూడ​అని  పిలుస్తున్నారు.

♨️మదీనా:
ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.

♨️చిక్కడపల్లి:
చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్​ పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది. బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్​పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.

♨️నౌబత్ పహాడ్:
నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.

♨️బాగ్‌లింగంపల్లి:
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్​షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.

♨️అడిక్‌మెట్: 
అడిక్‌మెట్ అసలు పేరు అధిక మెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.

♨️మీరాలంమండి:
సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీర్​ఆలం మండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్!

♨️బార్కాస్:
నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్అని పిలుస్తున్నారు.

♨️తాడ్​బండ్: 
తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్‌ బండ్‌గా మారిపోయింది.

♨️ఎర్రమంజిల్‌:
ఇర్రం మంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్‌ గా స్థిరపడింది. ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.

♨️కాచిగూడ:
కచ్ అనే తెగ వారు నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది.

♨️లాడ్‌ బజార్: 
మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. 
ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్‌ బజార్ లాడ్లీ అనే పేరు మీదనే స్థిరపడింది.

♨️ముషీరాబాద్:
హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్- ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 
1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.

♨️ఫతే మైదాన్:
ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. 
ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.

♨️పబ్లిక్ గార్డెన్స్:
పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్ -ఏ- ఆమ్ అని పిలిచేవారు.. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్ -ఏ -ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్.

♨️చాదర్ ఘాట్:
 మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.

♨️ఆస్మాన్ గఢ్:
 1887–-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.

♨️ఉమ్దా బజార్:
 నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. 
ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్​గా ప్రసిద్ధిగాంచింది.

♨️గౌలిగూడ:
గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.

♨️లల్లాగూడ:
 రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది. 

♨️సుల్తాన్ బజార్: 1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, 
ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.

♨️రికాబ్ గంజ్: 
రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.

♨️డబిర్ పురా:
నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.

♨️అంబర్‌ పేట:
అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.

♨️చాంద్రాయణగుట్ట:
చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.

♨️చిలకలగూడ: 
చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకల గూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!

♨️మంగళ్ హాట్:
మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.

♨️సైదాబాద్: 
1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.

♨️టప్పాచబుత్ర: 
టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.

♨️తుకారాం గేట్: 
లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. 
ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.

♨️యాఖుత్ పురా: 
హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్​పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు...

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :