ABV: ఏబీ వెంకటేశ్వర రావుకు లైన్ క్లియర్ చేస్తున్న చంద్రబాబు..!?
ఏబీ వెంకటేశ్వర రావు (AB Venkateswara Rao) పేరు తెలియని వారుండరు. ఆంధ్రప్రదేశ్ (AP) లో సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారి. రాజకీయాల రొచ్చులో ఇరుక్కుని అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సర్వీస్ నుంచి సస్పెండ్ (suspend) అయ్యారు. న్యాయస్థానాల్లో (courts) పోరాడి అనుకున్నది సాధించారు. ఏబీ వెంకటేశ్వర రావును చంద్రబాబు (chandrababu) మనిషిగా భావించిన గత వైసీపీ (YSRCP) ప్రభుత్వం ఆయన్ను నాలుగున్నరేళ్లపాటు విధులకు దూరంగా ఉంచింది. టీడీపీ (TDP) అధికారంలోకి వస్తే ఏబీవీకి (ABV) మంచి పోస్ట్ దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ నాలుగు నెలలు గడిచినా ఏబీవీకి ఎలాంటి పదవీ ఇవ్వలేదు చంద్రబాబు.
ఏబీ వెంకటేశ్వర రావు 2014-19 మధ్యకాలంలో ఇంటెలిజెన్స్ డీజీగా (Intelligence DG) పనిచేశారు. ఆ సమయంలో వైసీపీ నేతలను టీడీపీవైపు లాక్కురావడం, వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడం లాంటివి చేశారనే ఆరోపణలున్నాయి. తోటి ఐపీఎస్ అధికారులు కూడా ఆయన్ను చంద్రబాబు మనిషిగా ముద్రవేశారు. అందుకే 2019లో జగన్ (YS Jagan) అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వర రావును అవినీతి ఆరోపణలతో కేసు పెట్టింది. ఇజ్రాయెల్ (Israel) కంపెనీ పెగాసెస్ (Pegasus) నుంచి తన కుమారుడి కంపెనీ ద్వారా కొనుగోలు చేసిన పరికరాల్లో అవినీతి జరిగిందనేది ఆ కేసు సారాంశం. దీన్ని ఆధారంగా చేసుకుని ఏబీవీపై సస్పెన్షన్ విధించింది జగన్ ప్రభుత్వం. దీనివల్ల ఆయన DGP కాలేకపోయారు.
జగన్ పెట్టిన కేసులపై ఏబీ వెంకటేశ్వర రావు క్యాట్ (CAT), సుప్రీంకోర్టులను (Supreme Court) ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించడంతో 2022లో మళ్లీ విధుల్లో జాయిన్ ఆయ్యారు. ఆ సమయంలో మీడియాతో (Media) మాట్లాడినందుకు ఏబీవీపై క్రమశిక్షణా చర్యల పేరుతో మళ్లీ సస్పెండ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. 2024లో ఆయన రిటైర్ అయ్యే ముందు రోజు వరకూ ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. చివరకు కోర్టు ఆదేశాలతో చివరి రోజు సర్వీసులో జాయిన్ అయి రిటైర్ అయ్యారు. దీన్నిబట్టి ఏబీ వెంకటేశ్వ రావుపై జగన్ ఎంత కక్షగట్టారో అర్థం చేసుకోవచ్చు. అయినా ఏబీవీ రావు ఎక్కడా వెనక్కు తగ్గకుండా పోరాడారు.
ఏబీ వెంకటేశ్వర రావు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. కానీ ఆయనపై కేసులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిలో రెండింటి నుంచి ఇప్పుడు ఉపశమనం లభించింది. పెగాసెస్ తో పాటు వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించిన అభియోగాలను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రధాన కేసు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. పరికరాలు కొనేందుకు ఇంటెలిజెన్స్ డీజీకి అధికారం లేదని.. అయినా ఆ పరికరాలే కొననప్పుడు అవినీతి ఎక్కడ జరిగిందని ఏబీవీ పోరాడుతున్నారు. ఇది కొలిక్కి రావాల్సి ఉంది. అయితే ఐదేళ్లవుతున్నా ఈ కేసులో ఆధారాలు బయటపెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది.
పరికరాల కొనుగోలులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును క్లోజ్ చేసే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే ఏబీవీకి క్లీన్ చిట్ వచ్చినట్లే. అప్పుడు ఏబీవీ సేవలను వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. ఇంతకాలమైనా ఏబీవీకి ఎలాంటి పదవీ ఇవ్వలేదని.. ఆయన పార్టీకోసం చాలా నష్టపోయారని చాలా మంది చెప్తూ వస్తున్నారు. అయితే కేసులో ఉన్న వ్యక్తికి కీలక బాధ్యతలు ఇస్తే లేనిపోని సమస్యలు ఉంటాయని భావించిన చంద్రబాబు ఇన్నాళ్లూ ఆయన్ను పక్కనపెట్టారు. కేసు నుంచి బయటపడేసి తర్వాత ఏబీవీని వాడుకోనున్నారు. త్వరలోనే ఇది సాకారం కాబోతోందని సమాచారం.