Chandrababu: వైసీపీ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP), తెలుగుదేశం పార్టీల (TDP) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ (Congress), టీడీపీ అధికార ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య సైద్దాంతిక విభేదాలుండేవి కానీ నేతల మధ్య వైరం ఉండేది కాదు. ఎక్కడైనా కనిపిస్తే వైఎస్ (YSR), చంద్రబాబు (Chandrababu) కూడా పలకరించుకున్న సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య అలాంటి పరిస్థితి లేదు. చంద్రబాబు మొహం చూసేందుకు కూడా జగన్ (YS Jagan) ఇష్టపడట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని చంపేసేందుకు వైసీపీ ప్రయత్నించింది. ఇప్పుడు వైసీపీ అంతు చూసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
టీడీపీ విషయంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. చిన్న చిన్న విషయాలపై కూడా ఆయన కేసులు (police case) పెట్టారు. టీడీపీ నేతలు ఆర్థిక మూలాలను (financial resources) దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీ తట్టుకుని నిలబడగలిగింది. అధికారాన్ని కూడా కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ అంతు చూడాలని చాలా మంది టీడీపీ నేతలు (TDP Leaders) డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నట్టు పని చేయట్లేదు.
ఏదైనా చట్టప్రకారం చేసినప్పుడే దానికి విలువ ఉంటుంది. అడ్డగోలుగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తే ఇప్పుడు వైసీపీకి పట్టిన గతే రేపు టీడీపీకి పడుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే చట్టం తన పని తాను చేసుకుపోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani) కేసు విషయంలో పలువురు ఐపీఎస్ (IPS) లు, వైసీపీ నేతలు (YCP Leaders) ఇరుక్కున్నారు. అలాగే టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైసీపీ కీలక నేతలు నందిగం సురేశ్, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ తదితరులు బుక్ అయ్యారు. ఇప్పుడు ఈ వ్యవహారం సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) వరకూ వచ్చింది. ఇక రఘురామ కృష్ణం రాజును వేధించిన కేసు కూడా విచారణకు వచ్చింది.
ఇక మున్ముందు మరిన్ని కేసులు కూడా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి విశాఖ శారదాపీఠానికి (Visakha Sarada peetham) భూములు ధారాదత్తం చేసిన కేసులో జగన్ పై కేసు పెట్టే అవకాశం ఉన్నా ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. వదిలేసింది. గతంలో నంద్యాల ఎస్పీవై రెడ్డి (SPY Reddy) డిస్టిలరీకి విధించిన రూ.15 కోట్ల రూపాయల ఫైన్ ను చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేసింది. దీని వల్ల చంద్రబాబు లబ్ది పొందారంటూ ఆయనపై కేసు పెట్టింది. దాంతో పోలిస్తే విశాఖ శారదపీఠం వ్యవహారం చాలా పెద్దది. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.
ఇప్పడు మద్యం కుంభకోణంపై (liquor scam) కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. నాడు డిస్టిలరీలను కొంతమంది వైసీపీ నేతలు చేజిక్కించుకుని అడ్డగోలుగా సంపాదించారనే ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా డిస్టిలరీల్లో సీఐడీ సోదాలు చేపట్టింది. ఇందులో అవకతవకలు బయటికొస్తే కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. మున్ముందు భూములు, మైనింగ్, ఇసుక, లిక్కర్ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై కేసులు పెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎక్కడా తాము కక్ష సాధిస్తున్నాం అన్నట్టు కాకుండా చట్టప్రకారం మాత్రమే చర్యలు ఉండేలా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు.