Chandrababu: వీళ్లకు న్యాయం చేసేదెప్పుడు చంద్రబాబు సార్..!?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని (YSRCP) ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో గత ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP). ఆ కూటమి సూపర్ సక్సెస్ అయింది. ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో పొత్తుకోసం చాలా మంది నేతలు సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి వాళ్లంతా ఇప్పుడు పదవులకోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఇప్పటికీ తమకు పిలుపు రాలేదనే బాధ వారిలో కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీని (YCP) ధిక్కరించి టీడీపీకి జైకొట్టిన వారికి న్యాయం చేయడంలో ఆలస్యం పలు అనుమానాలకు తావిస్తోంది.
2019 నుంచి 2024 వరకూ ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఆ పార్టీకి తిరుగులేదు. అయితే పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని ధిక్కరించారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi).. పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Election) పార్టీ మాట కాదని టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. అప్పట్లో వీళ్ల నిర్ణయం సంచలనం కలిగించింది. పార్టీ అధికారంలో ఉండడంతో స్పీకర్ (Speaker) వీళ్లపై వేటు వేశారు. దీంతో పార్టీ నుంచి పూర్తిగా బయటికొచ్చారు.
ఇంతలో 2024 ఎన్నికలు రావడంతో ఈ నలుగురికీ టీడీపీ తరపున సీట్లు ఖాయమనుకున్నారు. వీళ్లు వ్యతిరేక గళం విప్పడంతో వైసీపీని డిఫెన్స్ లో పడింది. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ఓటమికి ఇక్కడే బీజాలు పడ్డాయి. అందులో కీలక పాత్ర పోషించిన వీళ్లందరికీ కచ్చితంగా టీడీపీలో తగిన ప్రాధాన్యం దక్కుతుందనుకున్నారు. అయితే అలా జరగలేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రం సీట్లు దక్కాయి. వాళ్లిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి (Minister) కూడా ఇచ్చారు చంద్రబాబు.
అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి మాత్రం సీట్లు ఇవ్వలేదు చంద్రబాబు. పొత్తులో (alliance) భాగంగా ఈ సీట్లను వాళ్లు త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయితే వీళ్లకు ఏదో ఒక పదవి కచ్చితంగా వరిస్తుందని అందరూ ఆశించారు. తొలి విడత నామినేటెడ్ పదవుల (nominated posts) జాబితా రిలీజైంది. కానీ జాబితాలో వీళ్ల పేర్లు లేవు. మరి చంద్రబాబు వీళ్లకు ఎలాంటి పదవులు ఇవ్వాలనుకుంటున్నారో తెలీదు. వీళ్లలో మాత్రం అసంతృప్తి పెరిగిపోతోంది. తమను బలిపశువులు చేశారేమో అనే ఫీలింగ్ కలుగుతోంది. వీళ్లను చంద్రబాబు వాడుకుని వదిలేశారని.. ఆయనకు ఇది అలవాటేనని ఇప్పటికే వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు న్యాయం చేయడంలో చంద్రబాబు ఆలస్యం చేస్తే మొదటికే మోసం రావచ్చు. మరి చంద్రబాబు ఏం చేస్తారో వేచి చూడాలి.