Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డికి జగన్ ఝలక్..! రీజనేంటి..!?
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YSRCP ) సంస్థాగత మార్పుల్లో బిజీగా ఉన్నారు. ఓటమి నుంచి కోలుకుని పార్టీ గట్టెక్కాలంటే కచ్చితంగా మార్పులు, చేర్పులు అవసరమని ఆయన నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఎన్నికల ముందు ఎంతో మంది నేతలను జంబ్లింగ్ చేశారు జగన్. అయితే అది వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ నేతలను వాళ్ల పాత స్థానాలకే పరిమితం చేస్తున్నారు. ఈ మార్పులు చేర్పుల్లో సజ్జల భార్గవ్ రెడ్డిని (Sajjala Bhargav Reddy) పదవి నుంచి తప్పించడం సంచలనం కలిగిస్తోంది.
సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరో అందరికీ తెలిసిన విషయమే. జగన్ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) కుమారుడే సజ్జల భార్గవ్ రెడ్డి. దాదాపు రెండేళ్లపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా విభాగాన్ని (YSRCP Digital Media Wing) సజ్జల భార్గవ్ రెడ్డి నడిపారు. వాస్తవానికి సజ్జల భార్గవ్ రెడ్డికి పార్టీతో కానీ, ప్రభుత్వంతో కానీ పెద్దగా సంబంధాలు లేవు. అయినా ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు జగన్. సజ్జల భార్గవ్ రెడ్డి కూడా తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు బాగానే కష్టపడ్డారు. అయితే అవి సత్ఫలితాలు ఇవ్వలేదు.
తాజా మార్పులు చేర్పుల్లో సజ్జల భార్గవ్ రెడ్డి స్థానంలో దొడ్డా అంజిరెడ్డిని (Dodda Anji Reddy) సోషల్ మీడియా వింగ్ అద్యక్షుడిగా ప్రకటించారు జగన్. దీంతో సజ్జల భార్గవ్ రెడ్డిని తప్పించినట్లయింది. సజ్జల భార్గవ్ రెడ్డిని తప్పించడంపై అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన్ను తప్పించడం వెనుక అనేక కారణాలున్నట్టు సమాచారం. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాను నడిపిన భార్గవ్ రెడ్డి కొన్ని వివాదాస్పద పోస్టులు (posts) పెట్టారు. తన టీంతో పెట్టించారు. వీటిపై ప్రస్తుత ప్రభుత్వం కేసులు పెట్టి విచారణ జరుపుతోంది. ఇది సజ్జల భార్గవ్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నట్టు సమాచారం. అందుకే ఆయన ముందస్తు బెయిల్ (bail) కోసం కూడా అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు సజ్జల భార్గవ్ రెడ్డి తీరుపైన పార్టీ శ్రేణుల నుంచి కొన్ని ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఈ పదవిని అడ్డం పెట్టుకుని సజ్జల ఫ్యామిలీ బాగానే వెనకేసుకుందని.. సాక్షాత్తూ కొంతమంది పార్టీ నేతలే జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పైగా సోషల్ మీడియా (Social Media) టీంను పార్టీకంటే తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం భార్గవ్ రెడ్డి ఎక్కువగా వాడుకున్నారే ఆరోపణలున్నాయి. ఐప్యాక్ (IPAC) తో సమన్వయం చేసుకుంటూ డిజిటల్ మీడియాను (Digital Media) నడిపించాల్సి ఉంది. అయితే సజ్జల బార్గవ్ రెడ్డి ఈ విషయంలో ఒంటెద్దు పోకడలతో వెళ్లారని.. అందుకే సత్ఫలితాలు రాలేదనే ఆరోపణలున్నాయి. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో సజ్జలను జగన్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.