ASBL Koncept Ambience
facebook whatsapp X

అతిశీ అను నేను..

అతిశీ అను నేను..

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్‌ నేత అతిశీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. అతిశీ చేత ప్రమాణం చేయించారు. అతిశీ ప్రస్తుతం ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అతిశీతో పాటు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావ‌త్ మంత్రులుగా ప్రమాణ‌స్వీకారం చేశారు. ఇందులో ముకేశ్ అహ్లవత్ ద‌ళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, అతిశీ తల్లిదండ్రులు, ఆప్‌ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. మూడో మహిళా సీఎం ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతిశీ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్‌, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్‌ తరువాత ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా అతిశీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలో మమతా బెనర్జీ ఒక్కరే మహిళా సీఎం కాగా, రెండో సీఎంగా అతిశీ నిలిచారు. అంతేకాదు, ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కురాలు (43)గా కూడా అతిశీ నిలిచారు. సలహాదారు పదవి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన అతిశీ అతి చిన్న వయసులోనే అత్యధిక శాఖలు నిర్వహించిన మహిళగా ఖ్యాతి పొందారు.

ఆప్‌ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పార్టీ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2013లో ఆప్‌లో చేరిన అతిశీ అదే ఏడాది పార్టీ ప్రణాళిక ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2020లో కల్కాజీ నుంచి గెలుపొందారు. గత ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అరెస్టయిన సంక్షోభ పరిస్థితుల్లో ఆమె మంత్రి పదవిని చేపట్టారు. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టిన అతిశీ.. సీఎం జైలుకెళ్లినప్పుడు అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేస్తూ ముందుకెళ్లారు.. ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సందర్భంగా సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఢిల్లీ ప్రజలు తాను నిజాయితీపరుడినని సర్టిఫికెట్‌ ఇచ్చేవరకూ సీఎం పదవిని చేపట్టబోనని ఆయన ప్రతినబూనారు. ఈ మేర‌కు కేజ్రీవాల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. తన మంత్రివర్గ సహచరులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలుసుకున్న కేజ్రీవాల్‌ తన రాజీనామా పత్రాన్ని అందించారు. కేజ్రీవాల్‌ స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :