బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్తనాటకం : బండి సంజయ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెరలేపారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాంగోపాల్పేటలోని పలు వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ స్థానికులతో సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సాఫీగా సాగుతుందని చెప్పారు. దేశద్రోహ, సంఘవిద్రోహ శక్తులైన ఉగ్రవాద సంస్థలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు, రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇటాలియన్ కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ దేశాన్ని వదలి వెళ్లాలన్నారు. ఆరు గ్యారంటీల నుంచి దృష్టి మళ్లీంచేందుకే హైడ్రా పేరుతో కొత్త నాటకానికి తెర లేపారని అన్నారు. పేద ప్రజల విషయంలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని, అప్పట్లో అనుమతులు ఇచ్చిన అధికారులు, ప్రభుత్వం యంత్రాంగపై చర్యలు తీసుకోవాలన్నారు.