వంద రోజుల కూటమి ప్రభుత్వంలో పెద్దగా కానరాని బీజేపీ..
2024 ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న కూటమి ప్రభుత్వం తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది.. ఎన్నికల సమయంలో కాస్త హడావిడి చేసిన బీజేపీ నేతలు అనంతరం పెద్దగా కనిపించడం మానేశారు. ప్రస్తుతం కూటమి లెక్కల్లో భాగంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ చేతుల్లో ఉన్నారు. ఇక వీరిలో కొందరు ఫైర్ బ్రాండ్లు కూడా ఉన్నారు. కానీ ఆ వేడి అసెంబ్లీలో కాదు కదా మొన్న వరదల్లో కూడా ఎక్కడ కనిపించలేదు.
కూటమి సర్కార్ కు 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు తమ జోష్ను బాగా చూపించాయి. అయితే ఇదే జోష్ బీజేపీ క్యాంపు లో మాత్రం కనిపించడం లేదు. వర్షాలు వరదలు కారణంగా పండక్కి దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వరద ప్రాంతాలలో మిగిలిన పార్టీ నేతలు ప్రజలకు సేవ అందిస్తూ తిరిగారు. కానీ బీజేపీ లీడర్స్ నుంచి ఆశించిన రీతిలో స్పందన లభించలేదు.
బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా ఒకరిద్దరూ మాట్లాడడం తప్ప ప్రజల సమస్యల గురించి పెద్దగా గళం విప్పింది కూడా లేదు. ఇక ఈ పార్టీ తరఫున సత్యకుమార్ వరద ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ.. అప్పటికే వరద ఉధృతి తగ్గడంతో ఆశించిన మేలు కానీ.. పేరు కానీ దక్కలేదు. దీంతో గట్టిగా తీసుకుంటే బీజేపీ నేతల నుంచి ఈ వంద రోజుల్లో సాధించిన ప్రగతి కూడా ఏమీ లేదు. బీజేపీ నాయకులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారే తప్ప.. ప్రభుత్వ పరంగా జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు. మరోపక్క టీడీపీ, జానసేన నాయకులు ప్రజలలో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి కమలనాధులు మాత్రం ఈ విషయంలో వెనుకబడి పోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు వంద రోజులు కూడా గడవకముందే ఈ నీరసం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది.