హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తోందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం, మంత్రులు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు తప్పితే, ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. సీఎం, మంత్రులు ఢిల్లీకి గులాములుగా మారారని ఎద్దేవా చేశారు. ప్రజావైద్యం పూర్తిగా పడకేసింది. పేదలు చదువుకునే గురుకులాలను నిర్వీర్యం చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు హైడ్రాను తెరపైకి తెచ్చారు. చట్టం చేయకుండా జీవో ద్వారానే హైడ్రాను నడుపుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టి బస్సుల సంఖ్యను తగ్గించారు. రైతుబంధు రాక, రుణమాఫీకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ 9 నెలల పాలనలో 400 మందికి పైగా రైతులు చనిపోయారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ చేసిన మోసానికి సురేంద్ రెడ్డి ఆత్మహత్యే తార్కాణం. ఫసల్ బీమా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తట్లేదు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పడితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి అవుతున్నారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఎమ్మెల్యేల పార్టీ మార్పులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ విలువలతో కూడిన రాజకీయాలను కోరుకుంటోంది అని అన్నారు.