ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతోందని బీజేపీ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 పోస్టులు తక్కువ ఇచ్చారని గతంలో కాంగ్రెస్ చెప్పిందని, అధికారంలోకి వచ్చాక కేవలం 60 పోస్టులు మాత్రమే పెంచిందని అన్నారు. చదువుకున్న వారికే పోటీ పరీక్షల విలువ తెలుస్తుందని, ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య 30 రోజుల కాల వ్యవధి ఉండాలని డిమాండ్ చేశారు. రూ.లక్షల జీతం తీసుకునే రేవంత్ రెడ్డి ఒక నిరుద్యోగ భృతి ఇవ్వడానికి డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. కుల, జన గణన ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే బయటకు తీస్తే 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. పంచాయతీ, ఎంపీటీసీ పదవీకాలం ముగిసి నెలలు గడుస్తున్నా, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదని మండిపడ్డారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.