సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా..!?
సినిమా ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చాలా సహజం. ఇటీవల మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను జస్టిస్ హేమ కమిటీ బయటపెట్టింది. ఈ నివేదిక తర్వాత మిగిలిన ఇండస్ట్రీలలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ పలువురు బయటకి వస్తున్నారు. అన్నిటికంటే టాలీవుడ్ లోనే ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉందని కూడా కొందరు చెప్పుకొచ్చారు. అయితే టాలీవుడ్ లో ఒక్కొక్కరికి ఒక్కోలా న్యాయం ఉంటుందని.. కొంతమందిపై అసలు ఫిర్యాదే తీసుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ చర్చ మళ్లీ మొదటికొచ్చింది.
నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ డ్యాన్సర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అదే సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ కూడా సమావేశమై జానీ మాస్టర్ ను డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఫిర్యాదు చేసిన అమ్మాయిని, జానీ మాస్టర్ ను కూడా విచారిస్తోంది. తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
అయితే అన్ని సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీ ఇలా స్పందించట్లేదనేది ప్రధాన ఆరోపణ. గతంలో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలో ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసింది. శ్రీరెడ్డి ఆరోపణలపై సినిమా ఇండస్ట్రీ పెద్దగా స్పందించలేదు. చివరకు ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక సమర్పించి రెండేళ్లయినా కూడా అది బయటకు రాలేదు. చర్యలు కూడా ఇంతవరకూ తీసుకోలేదు.
ఇక ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మీ టూ, కాస్టింగ్ కౌచ్ పై పలు సందర్భాల్లో చెప్తూనే వస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను గతంలోనే ‘మా’కు ఫిర్యాదు చేశానని.. ఎందుకు ఫిర్యాదు తీసుకోలేదని ఆమె తాజాగా ట్వీట్ చేశారు. తమకు రాజకీయ పలుకుబడి లేకపోవడం వల్లే తొక్కిపెట్టారా అని ఆమె ప్రశ్నించారు. అంటే ఇండస్ట్ర్రీలో ఫిర్యాదు చేసిన వ్యక్తుల స్థాయి, ఆరోపణలు వచ్చిన వ్యక్తుల స్థాయి ఆధారంగా వాటిని తీసుకోవాలా, స్పందించాలా.. విచారించాలా.. వద్దా.. అనే అంశాలు ఆధారపడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అందిస్తున్నట్టు తెలుస్తోంది.