ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్..
ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. ముఖ్యంగా ఇరానీయులు పిడివాదిని పక్కన పెట్టి సంస్కరణాభిలాషికి పట్టం గట్టారు.ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఇరాన్లో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో మసౌద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. పిడివాదిగా పేరుపొందిన సయీద్ జలిలితో పోటీపడి గెలుపొందారని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఈ ఎన్నికలో 30 మిలియన్ల మంది ఓటువేయగా పెజెష్కియాన్కు 16 మిలియన్లు.. జలిలికి 13 మిలియన్ల ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. సంస్కరణవాదిగా పేరున్న మసౌద్.. హృద్రోగ నిపుణుడు. ఇరాన్ను ఆంక్షల చట్రం నుంచి బయటకు తీసుకురావడానికి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తానని తన ప్రచారంలో పేర్కొన్నారు. ఆయన అభ్యర్థిత్వానికి మాజీ అధ్యక్షులు హసన్ రౌహానీ, మహమ్మద్ ఖాటామి మద్దతు ఉంది.
జూన్ చివర్లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగింది. నాటి పోలింగులో దాదాపు 60% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జులై 5న రెండో బ్యాలెట్ (రన్ఆఫ్ పోలింగ్)ను నిర్వహించారు. గత కొన్నేళ్లుగా ఇరాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఈ ఓటింగ్ పట్ల ఆసక్తి చూపలేదు. ఇద్దరు అభ్యర్థులను, వ్యవస్థను తిరస్కరించడానికే వారు ఇలా చేశారని మునుపటి ఓటింగ్ గురించి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో 50% పైగా వచ్చినవారే విజేత అవుతారని ఇరాన్ చట్టాలు చెబుతున్నాయి. అలా రానప్పుడు.. అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్ఆఫ్ పోలింగ్ నిర్వహించాలి. ఇలా 2005లో ఒకేఒక్కసారి జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి కనిపించింది.