దాన్ని జగన్ చెవులకు కట్టి తిప్పుతాను.. మండిపడ్డ చంద్రబాబు..
ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక వివాదం జరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా మెడికల్ సీట్ల వ్యవహారంపై ఏ రేంజ్ లో హడావిడి జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తన హయాంలో కేంద్రం నుంచి తీసుకువచ్చిన మెడికల్ సీట్లను చంద్రబాబు కాదు అని తిప్పి పంపుతున్నారు అంటూ.. ఇటీవల జగన్ పెద్ద ఎత్తున ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది పాయింట్లతో కూడిన ఓ ట్వీట్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు.
ఇక ఈట్వీట్ లో తాము ఎంత కష్టపడి మెడికల్ సీట్లు తెచ్చాము అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ పేదలకు దీనివల్ల కలిగే మేలు గురించి పేర్కొన్నారు. వైద్య కళాశాలలతో పాటు ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా రాష్ట్రంలో పేదలకు ఇక్కడ వైద్య విద్య చదువుకునే అవకాశం ఉంది అని జగన్ అన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో ని కూడా పక్కనపెట్టి వైద్య కళాశాల సీట్లను తమకు అవసరం లేదంటూ వెనక్కి పంపుతోందని జగన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఎన్నికలకి ముందు వైద్య కళాశాల నిర్మాణం పై చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను మరొకసారి గుర్తు చేసిన జగన్.. ఇప్పుడు ఇలా చేయడం సబబేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన చంద్రబాబు జగన్ ఆరోపణలకు తన స్టైల్ లో రిటార్ట్ ఇచ్చారు. జగన్ తెచ్చిన జీవో ని ఎవరైనా జీవో అని అంటారా.. అది ఒక దిక్కుమాలిన జీవో అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
అంతేకాదు ‘ఆయన ఒక జీవో ఇచ్చారట.. ఆ జీవో ని ఆయన చెవులకే కట్టి రాష్ట్రమంతా తిప్పుతాను. సూటిగా ప్రశ్నిస్తున్నాను అసలు దాన్ని జీవో అని అంటారా.. ఏం అమలు చేశాడు ఆ జీవోతో అతన్ని చెప్పమనండి? ఆ జీవో వల్ల ఎవరికి లాభం? మీడియా వారు కూడా ఆ జీవో గురించి ఒకసారి చదివి తెలుసుకోవడం మంచిది’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. నేరస్తులు మాట్లాడే మాటలను ప్రజలు ఎప్పటికీ నమ్మరు అని స్పష్టం చేసిన చంద్రబాబు.. నిజంగా ప్రైవేట్ ఆస్పత్రిల విషయంలో జగన్ తీసుకువచ్చిన జీవోను ఎవరైనా చదివితే అందులో ఎంత దుర్మార్గం ఉందో బయట పడుతుందని వ్యాఖ్యానించారు.