నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు .. సీఎం చంద్రబాబు ఆదేశం
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం, అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు. విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని పటిష్ఠ దర్యాప్తు జరపాలని ఆదేశించారు. రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో, అంతే సీరియస్గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు. కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు ఎవరూ అధైర్య పడొద్దని, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటందని హామీ ఇచ్చారు. ఘటనపై విచారణకు సంబంధించి ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.