వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం : చంద్రబాబు
ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తనతో సహా మంత్రులు, అధికారులు బురదలోనే తిరుగుతున్నారని తెలిపారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. కబేళా సెంటర్లో వరద బాధితులతో మాట్లాడారు. తొమ్మిది రోజులుగా ప్రజలు పడిన బాధలు వర్ణనాతీతమన్నారు. బుడమేరకు గండ్లు పడినా గత పాలకులు పట్టించుకోలేదని, బుడమేరు ప్రాంతాన్ని కజ్జా చేశారని విమర్శించారు. ప్రభుత్వానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. రూ.పదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి జగన్ గద్దె దిగిపోయారు. వచ్చిన ఈ బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతయినా పోయేవి. కానీ, బెంగళూరులో కూర్చొని మాపై బురద జల్లుతున్నారు. ఇంత పెద్ద మహా యజ్ఞంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాం. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం. వారికి ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తాం అన్నారు.