వాలంటీర్లకు పంగనామం పెట్టిన జగన్.. ఇక వారికి దిక్కెవరు?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంతకీ వారి ఉద్యోగాలు ఉన్నాయా? లేదా? అన్న విషయం పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో కూడా వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వాలంటీర్ల పదవీకాలం ఏడాది కిందటే ముగిసింది అని చంద్రబాబు చిన్న సైజు బాంబు పేల్చారు.
అంతేకాదు గత ప్రభుత్వం వాలంటీర్లతో ఏర్పరచిన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని.. ఎన్నికలకు ముందు కంటి తడుపుగా మూడు నెలల జీతాలను చెల్లించినట్లు చంద్రబాబు వివరించారు. పైగా ఎన్నికలకు ముందు చాలామంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు.. మిగిలిన వారికి పదవీకాలం ముగిసింది.. దీంతో ఇప్పుడు వీళ్ళ ఉద్యోగాలు కంటిన్యూ అవుతాయా లేదా అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాదు వాలంటీర్ల పదవీకాలం రెన్యువల్ చేయకపోవడంతో పాటు వారి జీతాల బిల్లులు కూడా లేవు అని ఆయన పేర్కొన్నారు. కేవలం వైసీపీ నేతలు చేసిన పని కారణంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ రికార్డుల్లోనే లేకుండా పోయిందని.. అయినప్పటికీ మూడు నెలల జీతం ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. అంతే కాదు గతంలో వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పంపకం కష్టమని వైసీపీ ప్రచారం చేసింది అని గుర్తు చేసిన చంద్రబాబు.. ప్రతినెలా ఒకటవ తేదీ పేదల సేవ పేరుతో ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ పూర్తి చేశారని తెలియపరచారు.
2023 ఆగస్టు తోటే గ్రామ, వార్డు వాలంటీర్ల గడువు ముగిసింది. కానీ జగన్ ప్రభుత్వం వారి సేవలను పునరుద్ధరించాలి అన్న విషయాన్ని కూడా మరిచిపోవడంతో అసలు చిక్కు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంచాలా? ఒకవేళ కొనసాగిస్తే ఎలా క్రమబద్ధీకరించాలి? వారి జీతభత్యాలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? అన్న విషయంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. మొత్తానికి జగన్ దూరదృష్టి లేకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చి పడ్డాయో చూడండి..