తిరుమల లడ్డూపై చంద్రబాబు వాఖ్యలు వ్యూహాత్మకమా..? యథాలాపమా..?
తిరుమల లడ్డూల్లో (Tirumala Laddu) కల్తీ నెయ్యి (adulterated ghee) వాడారని.. ముఖ్యంగా జంతువుల కొవ్వులు (animal fat) కలిశాయనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై హిందువులు, హిందూ సంఘాలు (Hindus) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే వైసీపీ (YCP) మాత్రం తాము చేసింది కరెక్టే అని చెప్పేందుకు, తమ చర్యలను సమర్థించుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. శాంపిల్స్ (Samples) తీసుకున్నది మీ హయాంలోనే కాబట్టి మీరే బాధ్యులు.. జులైలో రిపోర్టులు వస్తే ఇప్పుడెందుకు బయట పెట్టారు..? లాంటి ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
తిరుమలకు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేసేందుకు అర్హులైన కంపెనీలను ఆహ్వానిస్తూ ప్రతి 6 నెలలకోసారి టీటీడీ (TTD) టెండర్లు పిలుస్తుంది. అలా ఈ ఏడాది మే 12న టెండర్ పిలిచింది. అందులో తమిళనాడుకు (Tamilnadu) చెందిన AR ఫుడ్స్ కంపెనీ (AR Foods) టెండర్ దక్కించుకుంది. ఆ తర్వాత మే నెలాఖరు నుంచి జులై మొదటి వారం వరకూ 10 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. అప్పటికే 6 ట్యాంకర్ల నెయ్యిని వాడేశారు. 4 ట్యాంకర్లలో నెయ్యి నాణ్యత సరిగా లేదని భావించిన అధికారులు శాంపిల్స్ తీసి గుజరాత్ లోని NDDB CALF లాబ్ కి పంపించారు. ఆ రిపోర్టులు జులై మూడో వారంలో వచ్చాయి. ఆ వెంటనే టీటీడీ ఈవో AR ఫుడ్స్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి చట్టపరమైన చర్యలకు ఆదేశించారు. దానికి జరిమానా విధించేందుకు అవసరమైన ప్రాసెస్ కొనసాగుతోంది.
జూన్ 12న చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం కొలువుదీరింది. టీటీడీ ఈవోగా శ్యామలరావు (TTD EVO Syamala Rao) నియమితులైన తర్వాత చంద్రబాబును కలిసినప్పుడు లడ్డూ, ప్రసాదాల నాణ్యత తగ్గిపోయిందనే ఫిర్యాదులు వస్తున్నాయి. వెంటనే వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన దృష్టి పెట్టాలని ఈఓను ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం ఈవో శ్యామలరావు క్షుణ్ణంగా పరిశీలించి అనుమానం వచ్చిన శాంపిల్స్ ను పరీక్షలకు పంపించారు. ఆ పరీక్షల్లో AR ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి కల్తీ అని తేలింది. ఆ విషయం తెలిసిన వెంటనే AR ఫుడ్స్ పైన చర్యలకు ఆదేశించింది టీటీడీ.
అదే సమయంలో టీటీడీలో జరిగిన పలు రకాల అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ (Vigilence and Enforcement) విచారణ చేపట్టింది. ఆగస్టు రెండోవారంలోనే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి (YV Subba Reddy) మూడు దఫాలుగా నోటీసులు కూడా ఇచ్చింది. అయితే ఆయన వాటికి సమాధానాలు ఇవ్వలేదు. ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం తెరపైకి రాగానే ఈ విచారణకు అర్హత లేదని.. వెంటనే కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ( High Court) ఆశ్రయించారు.
వీటన్నిటినీ పరిశీలిస్తే టీటీడీలో అవకతవకలపైన కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఈవో తనిఖీలు చేసి అనుమానాస్పద వస్తువులను పరీక్షలకు పంపించి చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో అవకతవకలమైన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జులైలోనే విచారణ మొదలు పెట్టి ఆగస్టులోనే వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ శాఖాపరమైన వ్యవహారాలు కావడంతో ఇవేవీ బయటకు రాలేదు. అయితే మొన్న ఎన్డీయే (NDA) శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు యథాలాపంగా లడ్డూల్లో జంతువుల కొవ్వుపై మాట్లాడారు. దీంతో ఇది ఒక్కసారిగా సంచలనం కలిగించింది.
వాస్తవానికి ఈ అంశాన్ని ఇలా రచ్చ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు అర్థమవుతోంది. అందుకే లోలోపల చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటూ పోతోంది. అయితే తమ ప్రజాప్రతినిధులకు గత ప్రభుత్వ అక్రమాలను వెల్లడించే క్రమంలో చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వానికి దీన్ని ఇష్యూ చేయాలనే ఉద్దేశం ఉండి ఉంటే రిపోర్టులు వచ్చిన రోజే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించి ఉండొచ్చు. కానీ అలా చేయలేదు.