వారిని వదిలిపెట్టం.. కఠినచర్యలు తీసుకుంటాం : చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం బుడమేరు గట్లను పట్టించుకోలేదు. కృష్ణానదిలో 11.43 క్యూసెక్కుల వరద వచ్చింది. దీనికి తోడు డ్రెయిన్లు పొంగాయి. అన్నీ కలిసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయి. మంత్రి నిమ్మల రామనాయుడు, ఇరిగేషన్ అధికారులు రేయింబవళ్లు కష్టపడి బుడమేరకు పడిన మూడు గండ్లను పూడ్చారు. డ్రోన్ లైవ్ ద్వారా గండ్ల పూడ్చివేత పనులు పర్యవేక్షించాం. గత ఐదేళ్లుగా బుడమేరు ఆక్రమణలకు గురైంది. దాదాపు 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. దుర్మార్గమైన పాలనలో చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో ఆహారం, తాగునీరు అందించాం. ఎంత ప్రయత్నించినా శివారు ప్రాంతాలకు సరిగా సాయం అందించలేకపోయాం. మూడ్రోజుల పాటు ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాలేదు. ఐదేళ్లలో వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశారు. వరద బాధితులకు సాయం చేసేందుకు అనేక మంది మందుకొస్తున్నారు అని తెలిపారు.
కొందరు ఆర్థిక సాయం చేస్తుంటే, మరికొందరు ఆహారం సాయం చేస్తున్నారు. కానీ, వైసీపీ మాత్రం విషం చిమ్ముతోంది. ఓడిపోయారని ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే విధంగా ప్రవర్తిస్తున్నారు. కృష్ణాలో 11.20 లక్షల క్యూసెక్యుల ప్రవాహం ఉన్నప్పుడు నదిలో మూడు బోట్లు వదిలిపెట్టారు. ఆ బోట్లు కౌంటర్ వెయిట్కు కాకుండా కాలమ్ను ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. బోట్లకు వైసీపీ రంగులు ఎందుకున్నాయి? బోట్లు వదిలిన వారిని వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటాం. వరద ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది కష్టపడి పనిచేశారు. ప్రాణ నష్టం బాగా తగ్గించగలిగాం. ఫైరింజన్ల సాయంతో ఇళ్లు శుభ్రం చేస్తున్నాం. వరదలపై యుద్ధం చేశాం. గెలిచాం. యుద్ధంలో గెలిచాం. దాని ప్రభావం మాత్రం ఇంకా వెంటాడుతోంది. పాడైన ఇళ్లు సామగ్రి వివరాలు సేకరిస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు.