టీటీడీ బోర్డు మాదిరే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు : సీఎం రేవంత్
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. స్పీడ్ ప్రాజెక్టులపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని తెలిపారు. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు మాదిరే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు ఇవ్వాలని సూచించారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు. ఆలయ అభివృద్ధి పనులు అర్ధాంతంగా ఆపవద్దని స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.