మీది జీతభత్యాల కోసం చేసే ఉద్యోగం కాదు : సీఎం రేవంత్
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపకశాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారన్నారు. కాంగ్రెస్ హయాంలో 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. బడ్జెట్లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రజల ఆలోచనలు వినడం మా ప్రభుత్వం విధానం. పేదలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టాం. పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకున్న అందరికీ నా అభినందనలు. ఈ క్షణంలో మీ తల్లిదండ్రుల గుండె ఉప్పొంగుతుంది. మీది జీతభత్యాల కోసం చేసే ఉద్యోగం కాదు. విపత్తును జయించే సామాజిక బాధ్యత. నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు. మంత్రులు, ఉన్నతాధికారులను కలవండి. మీ రేవంత్ అన్నగా మీకోసం నేను అండగా ఉంటా. గ్రామాల్లో యువకులు తల్లిదండ్రులను సరిగా చూడడం లేదని నా దృష్టికి వస్తోంది. దయచేసి మీకు రెక్కలు వచ్చాక, కుటుంబాన్ని విడిచి వెళ్లవద్దని కోరుతున్నాను అని అన్నారు.