రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం
మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టు, జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన హైడ్రా వ్యవస్థ రెండు వేర్వేరని విడమరిచి చెప్పారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. Rajiv Gandhi Sadbhavana అవార్డును మాజీ మంత్రి గీతారెడ్డి కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...
దేశ సమగ్రతను కాపడటానికి చేపట్టిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రను స్పూర్తిగా తీసుకుని మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ అభివృద్ధికి ముందుకు సాగుతాం. ట్రాఫిక్ నియంత్రణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలుషితాలను నిలుపుదల చేయడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరోధించడం వంటి ఎన్నో ప్రజాసౌలభ్యాల కోసం హైడ్రా పనిచేస్తుంది. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు, 111 జీవోను ఉల్లఘించిన వారు మాత్రమే హైడ్రాను చూసి భయపడుతున్నారు.
మదపుటేనుగులను అణచడానికి అంకుశం తరహాలో హైడ్రా పనిచేస్తుంది. అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సామాన్యులకు అండగా ఉంటాం. మూసీ పునరుజ్జీవం, హైడ్రాను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. మురికికూపంలో నలిగిపోతున్న నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయించి వారి పిల్లలకు మంచి చదువులు అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారు వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని బోజగుట్ట ప్రాంత వాసుల సమస్యలను పరిష్కరిస్తాం.