బే ఏరియా ట్రేసీలో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం
కాలిఫోర్నియా రాష్ట్రంలోని ట్రేసీలో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం చేయాలన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాలతో అమెరికాలో ఉన్న ఆయన భక్తులంతా కలిసి దేవాలయ నిర్మాణానికి నడుంకట్టారు. ఆలయం నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించారు. స్వామీజీ కూడా కొంత విరాళాన్ని అందజేశారు. ఆశ్రమం నుంచి కూడా విరాళాలు రావడంతో స్థలంకోసం అన్వేషించి చివరకు 2021లో అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేశారు. నిర్మాణానికి అవసరమైన పర్మిషన్లు అధికారుల నుంచి రాకపోవడంతో వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ఇప్పుడు 2024లో పూజ్య గురువులు, హెచ్హెచ్ శ్రీ స్వామీజీ దయ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు లభించడంతో అనుమతులను తీసుకుని నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణాన్ని ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్మించనున్నారు. ఈ దశావతార శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2026 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిధులను కూడా సేకరిస్తున్నారు.
ఇటీవలనే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణంలో భాగంగా శ్రీనివాస కళ్యాణం కూడా జరిపారు. అనేకమంది ఈ వేడుకలకు హాజరయ్యారు.
కాలిఫోర్నియా బాలాజీ టెంపుల్ ట్రేసీ నడిబొడ్డున మౌంటైన్ హౌస్, ట్రేసీ హిల్స్, లాత్రోప్, మాంటెకా మరియు అనేక ఇతర కమ్యూనిటీలకు అనుకూలమైన ప్రదేశంలో నిర్మితమవుతోంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు యొక్క పది ప్రాథమిక అవతారాలను సూచించే ప్రత్యేకమైన దశావతార విగ్రహం భక్తులకు కనువిందు చేయనున్నది.
ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలకోసం ఈ టెంపుల్ వెబ్సైట్ను చూడవచ్చు.