టీడీపీ తీర్థం కోసం అవినాష్ ఎదురుచూపులు.. ఇది సాధ్యమేనా?
విజయవాడ రాజకీయాలలో సంచలనంగా వినిపిస్తున్న పేరు దేవినేని అవినాష్. నిరంతరం ఏదో ఒక రూపంలో ఈ పేరు చర్చనీయాంసంగా మారడానికి ముఖ్య కారణం టీడీపీ కార్యాలయం పై నమోదైన దాడి కేసు. మొదట్లో ఈ కేసును చాలా లైట్ గా తీసుకున్న అవినాష్ ఇప్పుడు ఇందులోంచి బయటపడడం కోసం టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్టు టాక్ నడుస్తోంది. అందుకోసం గత వారం రోజులుగా చర్చలు కూడా జరుపుతున్నారట.తన తండ్రికి స్నేహితులైన కొందరు నేతలతో ప్రస్తుతం అవినాష్ ఇదే విషయంపై మంతనాలు చేస్తున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి.
దీంతో విజయవాడ రాజకీయాలలో అవినాష్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కు అవినాష్ అవసరం ఉందా అనేది కొందరి ప్రశ్న. ఎన్నికలు పూర్తయిపోయాయి.. గెలుపు కూడా తన పార్టీకే దక్కింది.. ఇటువంటి సమయంలో దేవినేని కుటుంబంతో పనేంటి అన్నట్టు ఉన్నారు తటస్థంగా ఉండే నాయకులు. ఉన్నవాళ్లకే పదవులు సరిగ్గా రావడం లేదు అన్న అభిప్రాయం ఏర్పడుతున్న నేపథ్యంలో కొత్తగా బయట నుంచి నేతలను తీసుకురావడం అవసరమా అని మరికొందరు భావిస్తున్నారు.
ఇక సామాజిక వర్గం పరంగా తీసుకున్న.. విజయవాడ తూర్పులో టీడీపీకి అవినాష్ తో ఎటువంటి అవసరం లేదు. 2014 నుంచి ఇప్పటివరకు వరుస విజయాలతో గద్దె రామ్మోహన్ టీడీపీ కు విజయవాడ తూర్పును కంచుకోటగా మార్చారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సాలిడ్ గా గద్దెకే పడుతాయి. ఈ నేపథ్యంలో కొందరు దీనికి అడ్డు వేయాలి అనే దురుద్దేశంతో కావాలని వైసీపీ దేవినేని ఉమాని అస్త్రంగా ఉపయోగిస్తున్నారు అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఫాలోయింగ్ పరంగా చూసుకున్న.. రాజకీయ పరపతి పరంగా చూసుకున్న టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవినేని కుటుంబం పెద్దగా చేసింది ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవినాష్ కు టీడీపీ అవసరం ఉంది తప్ప పార్టీకి అతనిపరంగా ఎటువంటి బెనిఫిట్స్ లేవు. అలాంటప్పుడు అతని పార్టీలోకి చేరనివ్వక పోవడమే ఉత్తమం అన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.