Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి చంద్రబాబు బయటపడ్డట్టేనా..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును (Chandrababu arrest) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ (Skill Development) పేరుతో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని.. అందుకే ఆయన్ను అరెస్టు చేశామని అప్పటి జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ – ఈడీ (ED) చంద్రబాబు ప్రమేయం లేదని తేల్చేసింది. ఆర్థిక లావాదేవీల్లో అవకతవలకు, చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడ్డట్టే అనే టాక్ వినిపిస్తోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతలో నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇది ప్రైవేటు కంపెనీలతో కలిసి పని చేస్తుంది. అందులో భాగంగా సీమెన్స్ (SIEMENS), డిజైన్ టెక్ (Designtek) కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. యువతను గుర్తించి వారిలో నైపుణ్యాలను పెంపొందించడం ఈ కంపెనీ బాధ్యత. నోయిడా కేంద్రంగా పనిచేసే సీమెన్స్ సంస్థ ఒప్పందం ప్రకారం ఏపీలో ఆరు చోట్ల స్కిల్ ఎక్స్ లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాలి. దీనికయ్యే ఖర్చులో ఏపీ ప్రభుత్వం 10శాతం, మిగతా 90శాతం సీమెన్స్ కంపెనీ గ్రాంటుగా ఇవ్వాలి. ఈ రెండు కంపెనీలతో రూ.3356 కోట్లకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన 10 శాతం నిధులు ఇచ్చేసింది. కానీ ఆ సంస్థలు తమ 90 శాతం నిధులు ఖర్చు చేసినట్లు చెప్పాయి. అయితే వాస్తవానికి వాళ్లు ఖర్చు చేసిన సాఫ్ట్ వేర్ విలువ రూ.58 కోట్లేనని సీఐడీ ఆరోపించింది.
స్కిల్ డెవలప్మెంట్ పేరిట భారీగా అవకతవకలు జరిగాయని.. దాన్ని నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కేసు పెట్టింది. సీఐడీకి (CID) అప్పగించింది. సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఇందులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ను అరెస్టు (Chandrababu Arrest) చేసి జైల్లో పెట్టింది. మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేసింది. అయితే ఇది మనీ లాండరింగ్ (Money laundering) వ్యవహారం కావడంతో ఈడీ ఎంటరైంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఈడీ దర్యాప్తులో సీమెన్స్ కంపెనీకి షెల్ కంపెనీలు ఉన్నట్టు గుర్తించింది. అంతేకాక నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు నిర్ధారించింది. ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ.23 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీమెన్స్ కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ (ED Attach) చేయడంతో ఈ కేసులో చంద్రబాబు తప్పుచేశారని రుజువైందని వైసీపీ సంబరాలు చేసింది. ఆ పార్టీ అనుకూల మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే దీనిపై ఈడీ క్లారిటీ ఇచ్చింది. ఆ కంపెనీల నిధుల డైవర్షన్ వ్యవహారంలో చంద్రబాబుకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎక్కడా ఆయన పాత్ర ఉన్నట్టు ఆధారాలు లబించలేదని తేల్చేసింది. దీంతో చంద్రబాబుకు క్లీన్ చిట్ (cleanchit) ఇచ్చినట్లయింది.
సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు నిధులను తమ షెల్ కంపెనీల (shell companies) ద్వారా నిధులను టీడీపీకి, ఆ పార్టీ నేతలకు అందించాయని వైసీపీ ఆరోపించింది. సీఐడీ కూడా ఈ మేరకు అభియోగాలు మోపింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు వచ్చాయని కూడా తెలిపింది. అయితే ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం బయటకు రావడంతో అవన్నీ అసత్యాలేనని తేలాయి. మరోవైపు హైకోర్టులో చంద్రబాబుకు నిధులు అందినట్లు సీఐడీ సాక్ష్యాలు సమర్పించలేకపోయింది. దీంతో హైకోర్టు కూడా సీఐడీకి అప్పట్లో అక్షింతలు వేసింది. ఇప్పుడు ఈడీ కూడా చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ కేసు నుంచి ఆయన బయటపడ్డట్టేనని తెలుస్తోంది.