Ponguleti : పొంగులేటి ఇళ్లల్లో ఈడీ సోదాలు..! కారణం అదేనా..!?
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఈడీ (ED Raids) సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ (Delhi) నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇల్లు, ఫాంహౌస్ తో పాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు, కంపెనీలపై గతంలో కూడా ఐటీ (IT Raids), ఈడీ దాడులు (ED Raids) జరిగాయి. బీఆర్ఎస్ (BRS) లో ఉన్నప్పుడు ఒకసారి, ఎన్నికల సమయంలో మరోసారి ఈ సోదాలు జరిగాయి. ఇప్పుడు ఆయన మంత్రిగా (Minister) ఉన్నారు. ఈ దాడులను కాంగ్రెస్ (Congress) ప్రతీకార చర్యగా భావిస్తోంది. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కలిసి ఈ పని చేస్తున్నాయని ఆరోపిస్తోంది.
గతంలో సింగపూర్ (Singapore) నుంచి చెన్నైకి (Chennai) ఖరీదైన వాచ్ (Watches)లు వచ్చినట్లు కస్టమ్స్ (Customs) అధికారులు గుర్తించారు. అవి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి (Harsha Reddy) సంబంధించినవని తెలిసి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలోకం నవీన్ కుమార్ (Alokam Naveen) అనే వ్యక్తి సహాయంతో ఫహెర్దీన్ ముదీన్ (Fehruddin Mudin) అనే వ్యక్తి నుంచి హర్ష రెడ్డి ఆ వాచ్ లను కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ గుర్తించింది. ఈ వ్యవహారంపై మనీలాండరింగ్ (Money landering) తో పాటు మరో కేసును ఈడీ నమోదు చేసింది. ఈ కేసు విచారణలో అలోకం నవీన్ వంద కోట్ల విలువైన వస్తువులు స్మగ్లింగ్ (smuggling) చేసినట్లు గుర్తించారు. బహుశా దానికి సంబంధించి ఈడీలు తనిఖీలు చేస్తూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
పొంగులేటి కుటుంబం రాఘవ కన్ స్ట్రక్షన్స్ (Raghava Constructions) పేరిట కంపెనీ నిర్వహిస్తోంది. దేశవిదేశాల్లో ఈ కంపెనీ పలు నిర్మాణ కార్యక్రమాలు చేపడుతోంది. బహుశా దీనికి సంబంధించి ఆర్థిక అవకతవకలు జరిగి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. అయితే ఇటీవల కర్నాటకలో (Karnataka) వాల్మీకి కుంభకోణం (Valmiki Scam) వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన నగదు కొంత తెలంగాణకు వచ్చిందనే అనుమానాలున్నాయి. ఇది ఒక యాంగిల్ అయితే.. ఇప్పుడు దేశంలో జరుగుతున్న పలు రాష్ట్రాల ఎన్నికలకు (Elections) తెలంగాణ నుంచే నగదు అందుతోందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందులోనూ ఆర్థికంగా బలవంతుడైన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఇప్పుడు శ్రీనివాస రెడ్డికి చెందిన కంపెనీల నుంచి నగదు వెళ్తోందనే అనుమానాల నేపథ్యంలో బీజేపీ ఈడీ దాడులకు పురిగొల్పి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఈ పని చేస్తున్నాయని.. తెలంగాణ ప్రజలందరికీ ఈ విషయం అర్థమవుతోందని చెప్తున్నాయి. మొత్తానికి పొంగులేటి ఇళ్లలో ఈడీ సోదాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత ఈడీ ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.